Tuesday 18 June 2013

జగన్‌ది తప్పు ఎలా అవుతుంది?: భూమన

హైదరాబాద్: మంత్రులకు ఓ న్యాయం, వైఎస్ జగన్‌కు మరో న్యాయమా అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. మంత్రులు ఏతప్పు చేయలేదని సీఎం అసెంబ్లీలోనే చెప్పారని, మంత్రులది తప్పుకాకుంటే వైఎస్ జగన్‌ది తప్పు ఎలా అవుతుందన్నారు. క్విడ్‌ప్రోకో జరగనపుడు వైఎస్ జగన్‌ నేరస్తుడు, కుట్రదారుడు ఎలా అవుతారని అడిగారు. ఒక్క రోజు కూడా ప్రభుత్వభాగస్వామిగా లేని వైఎస్ జగన్ నేరస్తుడు ఎలా అవుతారని నిలదీశారు. 

చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల సంగతి టీడీపీ నేతలు మరచిపోయారా అని అన్నారు. టీడీపీ ఓ పక్క ప్రభుత్వాన్ని కాపాడుతూ, మరో పక్క కళంకిత మంత్రులంటూ నాటకాలాడుతోందని భూమన విమర్శించారు. 

Friday 14 June 2013

జగన్ కోసం యువకుడి ఆత్మహత్య

మెదక్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వీరారెడ్డి అనే యువకుడు జగన్ ను విడుదల చేయడంలేదన్న మనఃస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కలిసికట్టుగా పనిచేయాలి: ఎంపీ మేకపాటి

తిరుపతి : చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కలసి కట్టుగా పని చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు-ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ఆయన టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఇక నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు.

అక్రమ అరెస్టులకు సిఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్: తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి, డిజిపి, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకరరావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ సందర్భంగా ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలయినా సీఎంపై చర్యలకు హైకోర్టులో పిల్ వేస్తానని ఆయన హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే: YS విజయమ్మ

తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నగారాను శుక్రవారం తిరుపతి నగరం నుంచి మోగించింది. రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను సమర్థంగా ఢీకొట్టేందుకు పార్టీ శ్రేణులకు గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ కర్తవ్యబోధ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యమని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయానికి కార్యకర్తలే మూలమని అన్నారు. 

సదస్సుకు తరలి వచ్చిన రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి నాయకులు, ప్రతినిధులను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీలన్నీ కైవసం చేసుకోవాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని ఆమె అన్నారు. స్థానిక సమస్యలపై కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా ప్రతి ఎన్నికల్లోనూ పార్టీదే విజయమన్నారు.

వైఎస్ జగన్ ను దెబ్బ తీయడమే కాంగ్రెస్, టీడీపీల లక్ష్యమని విజయమ్మ అన్నారు. ఆరెండు పార్టీల ఎత్తుగడలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ సత్తా ఏంటో చూపేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అవకాశమన్నారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

రేపు తెలంగాణ బంద్ కు కేసీఆర్ పిలుపు

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రేపు తెలంగాణ బంద్ కు
పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్ట్ లు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వ దమన కాండను నిరసిస్తూ శనివారం బంద్ పాటించాలని కేసీఆర్ కోరారు. 

అక్రమ అరెస్ట్ లు వద్దు:హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్ మోషన్ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు సూచన చేసింది. అక్రమ అరెస్ట్లులు లేకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ బంద్ కు ఓయూ జేఏసీ పిలుపు

హైదరాబాద్ : విద్యార్థుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ ఛైర్మన్ కిషోర్ డిమాండ్ చేశారు. కాగా మరోవైపు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

సోనియా గాంధీ తో ఆజాద్ భేటీ

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ముట్టడి అంశాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, అంతకు ముందు డిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గులాంనబీ ఆజాద్ ను కలిశారు. వారు కూడా అసెంబ్లీ ముట్టడి, రాష్ట్రంలో పరిస్థితులపైనే చర్చించినట్లు తెలిసింది.

మోడీ వివాదంతో జేడీయూలో చీలిక!

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ వివాంతో జేడీయూలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్డీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెబుతోంటే, మరోవైపు నితీష్ కుమార్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బీహార్ లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్ కుమార్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ సస్పెన్స్ కొనసాగుతోంది.