Friday 14 June 2013

ఎమ్.పి విజయశాంతికి దేవుడి ఆశిస్సులు ఉంటాయా?

తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ ఎమ్.పి విజయశాంతికి కొత్త దిగులు పట్టుకుంది. ఈసారి మెదక్ లోక్ సభ సీటు రాదన్న ప్రచారం ఆమెకు చికాకు కలిగిస్తోంది.టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు ఈసారి మెదక్ సీటు నుంచి పోటీచేయాలని భావిస్తుండడమే దీనికి కారణం.ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ నుంచి పోటీచేయడం బాగుంటుందని కెసిఆర్ అనుకుంటున్నారు.తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ అయిన సిద్దిపేట అందులో ఉండడం,పైగా తన ప్రభావంతో మెదక్ జిల్లాలో మరికొన్ని అసెంబ్లీ సీట్లు గెలిచే అవకాశం ఉండడం వంటి కారణాలతో ఈసారి సొంత జిల్లా నుంచి పోటీచేయాలని కెసిఆర్ యోచిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కరీంనగర్ నుంచి మూడుసార్లు ( ఒక సాధారణ ఎన్నిక,రెండు ఉప ఎన్నికలు)మహబూబ్ నగర్ నుంచి ఒకసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.కిందటిసారే మెదక్ నుంచి పోటీచేయాలని అనుకున్నా, విజయశాంతికి మాట ఇచ్చినందున ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీచేసి తీవ్రమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆయన మెదక్ నుంచి పోటీచేస్తే, విజయశాంతికి సికింద్రాబాద్ సీటు ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.కాని విజయశాంతికి ఇక్కడ నుంచి పోటీచేయడం ససేమిరా ఇష్టం లేదు.అయితే తప్పకపోతే తనకు మెదక్ బదులు జహీరాబాద్ లోక్ సభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు సమాచారం.కాని సాధ్యమైనంతవరకు మెదక్ ను వదలిపెట్టరాదన్న అబిప్రాయంతో ఉన్నారు.దేవుడు ఆశిస్సులు తనకు ఉంటే మెదక్ సీటు నుంచే పోటీచేస్తానని విజయశాంతి తాజాగా వ్యాఖ్యానించడం గమనించవలసిన అంశం. కాగా టిఎన్జీఓ నేత దేవీ ప్రసాద్ కూడా మెదక్ సీటు ఇస్తే పోటీచేయాలని లోక్ సభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ మేరకు జెఎసి సమావేశాలలో కూడా ఆయన ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది.ఎన్.జి.ఓ నేతలు కొందరు టిఆర్ఎస్ నాయకత్వం తో దీనిపై మాట్లాడాలని కూడా బావిస్తున్నారు.మెదక్ సీటు మొత్తం మీద హాట్ ఫేవరైట్ గా ఉండడం విశేషం.

0 comments:

Post a Comment