Saturday 11 May 2013

తల్లమడ నుంచి YS షర్మిల పాదయాత్ర

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నేడు షర్మిల పాదయాత్ర తల్లమడ నుంచి ప్రారంభం కానుంది. బేతుపల్లి మీదుగా మరో ప్రజాప్రస్థానం గంగారం చేరుకుంటుంది. భోజన విరామం అనంతరం పాతపాకలగూడెం, పాకలగూడెం, గురుబట్లగూడెం మీదుగా షర్మిల పాదయాత్ర చేస్తారు. చివరిగా లింగగూడెం చేరుకుంటారు. నిన్నటికి షర్మిల 19వందల 40 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో ఆమె పాదయాత్ర నేటి సాయంత్రం ముగియనుంది. ఈ సాయంత్రం మరోప్రజాప్రస్థానం పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభం కానుంది.

మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ మళ్లీ పార్టీ మారతారా!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ్ కూడా పార్టీ మారతారా? దీనిపై కదనాలు వస్తున్నాయి. ఆమదాల వలస నుంచి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన సీతారామ్ గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి టిడిపిలోకి వచ్చారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.విశాఖలో జరిగిన పాదయాత్ర ముగింపు సభకు కూడా రాలేదు. దీంతో ఆయన కూడా పార్టీలో ఉంటారా?ఉండరా అన్న చర్చ జరుగుతోంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లే విషయమై ఆయన తర్జనభర్జన పడుతున్నారు.అయితే ఆ పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదని అందువల్లనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా టిడిపికి ఇలాంటి వలసల ప్రచారం కొంత నష్టం చేస్తుంది.

మాజీ మంత్రి శంకరరావు చెప్పినట్లు చేస్తే మాత్రం..

మాజీ మంత్రి డాక్టర్ పి.శంకరరావు మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.కిరణ్ ప్రభుత్వం పనితీరు, కిరణ్ శైలి, అవినీతి అభియోగాలకు గురైన మంత్రులకు సంబందించిన విషయాలపై కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ విషయాలపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. కేంద్రంలో మాదిరి ఇక్కడ కూడా ఆరోపణలకు గురైన మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు.అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న కిరణ్ ను కూడా తప్పించాలని డిమాండ్ చేశారు.వీటిపై సోనియాగాంధీకి లేఖ రాస్తానని ఆయన అంటున్నారు. కొందరు మంత్రులను తప్పిస్తేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుదని ఆయన అన్నారు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందని శంకరరావు ఎలా భరోసా ఇస్తున్నారో తెలియదు. ముందుగా ఆయన టార్గెట్ కిరణ్ కాబట్టి , ఆయన వంతుగా ఆయన ఆరోపణలు చేసి కాంగ్రెస్ ఘనతను ఆయనే తెలియచేస్తున్నారనుకోవాలి.

కిరణ్ కుమార్ రెడ్డిపై ఏ సీనియర్ మాట వినాలో

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆర్టీసి చైర్మన్ , మాజీ మంత్రి ఎమ్.సత్యనారాయణరావు మండిపడ్డారు.కిరణ్ తన ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ సీనియర్లను కలుపుకుని పోవడం లేదని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఎవరు సీనియర్లో, ఎవరు జూనియర్లు అన్నది తేల్చడమే కష్టం.పైగా అందులో ఏ సీనియర్ ను విశ్వాసంలోకి తీసుకోవాలి? ఎవరిని తీసుకోరాదన్నది తేల్చుకోవడం అంత తేలిక కాదు.ఇలా సీనియర్లుగా చెబుతున్న కొందరు రోశయ్య ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఏవేవో సలహాలు ఇచ్చి, ఆయనను గందరగోళంలో పడేశారు.రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు. కాంగ్రెస్ లో సీనియర్లు అంటే ప్రమాదం అన్న సంగతిని కిరణ్ గ్రహించారో, ఏమో కాని ఆయన ఈ తరహా సీనియర్లతో జాగ్రత్తగానే ఉంటున్నట్లున్నారు. అయితే అదే సమయంలో ఆయన తన మంత్రివర్గంలోని పలువురుతో కూడా అంతంత మాత్రం సంబంధాలు కొనసాగించడం, కొందరు ఎమ్.పిలతో విబేధాలు రావడం వంటివాటివల్ల ఇబ్బంది పడుతున్నారు.

మంత్రి టిజి వెంకటేష్ కు ఇదో అలవాటు!

కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు. ఆయన ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకు తోచదు. అందులోను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన వ్యాఖ్యలు చేసి ఎప్పుడూ వార్తలలో ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో ఆయన ఏదైనా మాట్లాడుతుంటారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ వాదం మూలనపడిందని మంత్రి వ్యాఖ్యానించారు. సమైక్యవాదం స్థానికంగా బలపడిందని చెప్పారు. ఇది సీమవాసుల ఘనతే అని చెప్పారు. అక్కడితే ఆగారు.ఇంకా నయం.ఇదంతా తన ఘనతే అని చెప్పుకోలేదు.నిజానికి తెలంగాణవాదం మూలన పడిందని అనుకోవడం భ్రమ. అంతేకాక,ఒకవేళ ప్రజలలో దాని గురించి ఆలోచన తగ్గినా టిజి వెంకటేష్ లాంటి నేతల వ్యాఖ్యలతో అది మరింత పుంజుకునే ప్రమాదం ఉంది.కనుక టిజి వెంకటేష్ ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా కట్టడిచేయగలిగేది ఎవరు?

కేంద్ర మంత్రి చిరంజీవికి పుత్ర ప్రేమ ఎక్కువేలా ఉంది..

కేంద్ర మంత్రి చిరంజీవి తన కుమారుడు చరణ్ పై వచ్చిన దాడి ఆరోపణలపై తాను మాట్లాడేదేముందని వ్యాఖ్యానించారు.ఆ ఘటనపై చరణ్ తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.గత ఆదివారం చరణ్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ ఒకటిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో గొడవ పడడం,సెక్యూరిటి సిబ్బంది వారిని కొ్ట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.తాజాగా వచ్చిన కదనాల ప్రకారం దాడి చేసిన సిబ్బంది రాష్ట్ర నిఘావిభాగానికి చెందినవారుగా తేలింది. కేంద్ర మంత్ర భద్రతకోసం ఏర్పాటైన వారు ఆయన కుమారుడు తరపున దారిపోయేవారిపై దాడి చేయడం ఏమిటన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై చిరంజీవి తన కుమారుడు తప్పు చేసి ఉంటే తాను కూడా కోప్పడతానని చెప్పి ఉంటే బాగుండేది.అలాగే జరిగినదానికి చింతిస్తున్నానని అని ఉంటే ఆయనకు మరింత పెద్దరికం వచ్చేది.కాని చిరంజీవికి పుత్ర ప్రేమ ఎక్కువేమో కాని ఆయన తన కుమారుడు ఇచ్చిన వివరణతో తప్పేమీ జరగలేదని భావిస్తున్నారని అనుకోవాలి.

'టీవీ9' రవిప్రకాశ్ ను చెప్పుతో కొట్టిన మాజీ విలేకరి!

కర్నూలు: టీవీ9 సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ పై మాజీ విలేకరి శుక్రవారం దాడి చేశారు. వరదబాధితుల కోసం నిర్మించిన టీవీ9 ప్రజానగర్ ఫేజ్ టూలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా రవి ప్రకాశ్ ను రమణ అనే విలేకరి చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన అనంతరం రమణపై సిబ్బంది దాడికి దిగారు. అయితే రమణపై జరిగిన దాడిని పోలీసులు అడ్డుకున్నారు. రవిప్రకాశ్ పై దాడికి కారణాలేమి ఇంకా తెలియరాలేదు. రవి ప్రకాశ్ పై దాడిని పలువురు జర్నలిస్టులు ఖండించారు. దాడి చేసిన రమణను కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. 

జగన్ కాంగ్రెస్ లోఉంటే కష్టాలువచ్చేవికాదు : ఎం.సత్యనారాయణ

కరీంనగర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఇన్ని కష్టాలు పడేవారు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ అన్నారు. జగన్ కొత్తపార్టీ పెట్టకుంటే ఈ కష్టాలు వచ్చేవే కాదని చెప్పారు. 

దాడి ఘటనపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారు: చిరు

కాకినాడ: సాప్ట్ వేర్ ఇంజినీర్ల దాడి ఘటనపై రామ్ చరణ్ వివరణ ఇచ్చారని, దానిపై తాను మాట్లాడటానికి ఏమీ లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. గత ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు, సాప్ట్ వేర్ ఇంజినీర్లకు మధ్య గొడవ జరగడం, రామ్ చరణ్ రక్షణ సిబ్బంది వారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై తన తప్పేమీలేదని చరణ్ వివరణ ఇచ్చారు. ఆ విషయమై చిరంజీవి మాట్లాడుతూ చరణ్ వివరణ ఇచ్చారని చెప్పారు. 

కాకినాడ సాగరతీరంతో పాటుగా తిరుపతిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చిరంజీవి చెప్పారు. 

వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు : దాడి

విశాఖ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న వన్ పాయింట్ ఫార్ములాను అందరూ అనుసరించాలని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను అధికారంలోకి తేవటమే లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన తొలిసారి శనివారం జిల్లాకు విచ్చేశారు. 

ఈ సందర్బంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతు సమాజం మార్పుకోరుకుంటోందని.... వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అందలం ఎక్కించాలన్నది ప్రజల భావనగా కనిపిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని దాడి అన్నారు. 

అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఏముందని ...ప్రధానమంత్రే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని ఆయన పేర్కొన్నారు. ఏ జైల్లో పెట్టినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని జగన్‌ చెప్పారని, ఇది ఎంతో దమ్మున్న నాయకుడి లక్షణమని దాడి వ్యాఖ్యానించారు.

పదవి కోసం కాదని... గౌరవం కోసమే వైఎస్ఆర్‌ పార్టీలో చేరానని దాడి వీరభద్రరావు తెలిపారు. కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాని ఆయన అన్నారు. తమ మధ్య విభేదాలున్నాయనేది మీడియా సృష్టేనని దాడి కొట్టిపారేశారు. కొణతాల బాధ్యత కలిగిన నాయకుడని, అందరం కలిసి వైఎస్‌ఆర్‌ సీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

నేను పార్టీ మారుతున్నట్లు ఎవరు చెప్పారు

తాను పార్టీ మారుతున్నట్లు ఎవరు చెప్పారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు.కాంగ్రెస్ వారు కలలు కంటుంటే తానేమీ చేయగలనని అన్నారు. వారు ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసుకుంటుంటే తనకు పోయేదేమిటని కొణతాల కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. స్థానిక ఎన్నికలలో జగన్ ప్రచారం చేయకుండా ఉండడం కోసమే బెయిల్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. దాడి వీరభద్రరావు గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించడానికి ఆయన సుముఖత వ్యక్తం పరచలేదు.

ప్రభుత్వంపై శంకరరావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రభుత్వంపై మాజీ మంత్రి శంకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రుల మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పదవి నుంచి తప్పించాలని ఆయన అన్నారు. వెంటనే సీఎల్ పి సమావేశం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పనితీరు, సీఎం వ్యవహారశైలి, అవినీతి మంత్రుల అంశాలపై సమావేశంలో చర్చించాలన్నారు. వీటిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. ఈ విషయంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానన్నారు. ఇదే మంత్రి మండలి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని హెచ్చరించారు. సీఎం, కొందరు మంత్రులను తప్పిస్తేనే రాష్ట్ర కాంగ్రెస్ కు భవిష్యత్ ఉంటుందని చెప్పారు.