Friday 31 May 2013

బాబు మానసికస్థితిపై జూపూడి ప్రభాకర రావు అనుమానాలు

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గానీ, మిత్రుల గానీ ఆయనను విదేశాలకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మంచిదని సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైదీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జైళ్లలో అభ్యంతరకర సౌకర్యాలు అందజేస్తున్నారని చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణలపై జైళ్ల శాఖ డిజి కృష్ణంరాజు స్పందించారని తెలిపారు. టీడీపీ నేతలకు చెంపపెట్టులా కృష్ణరాజు వివరణ ఇచ్చారని చెప్పారు. ఆయన వివరణకు టీడీపీ నేతలు ఇంతవరకూ ఎందుకు స్పందిచలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ములాఖత్ లపై గతంలో వైఎస్ భారతి విసిరిన ఛాలెంజ్ కు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. చంద్రబాబు తన అలవాట్లను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పై టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా జూపూడి హెచ్చరించారు. 

టీఆర్‌ఎస్, జేఏసీకి టిడిపి ఆఫర్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టిడిపి నేత పెద్దిరెడ్డి ఆఫర్ ప్రకటించారు. కావాలంటే షరతులు పెట్టి తమను కలుపుకోవచ్చని కూడా చెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు (కెసిఆర్) నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా ఆయన విగ్రహాలు పెడతామని చెప్పారు. ఆయన ఫొటోలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతామన్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేవారంతా పదవులకోసమేనని విమర్శించారు. ఉద్యమాన్ని పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2014 తర్వాత ఆ పార్టీలో వలసవెళ్లినవారు తప్ప ఉద్యమకారులుండరన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఎసి గొడుగు కింద కెసిఆర్ స్వతంత్ర ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపు ఇచ్చారు.

తిరుపతి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి అనుమతి

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయిరెడ్డి తిరుపతి వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి వెళ్లేందుకు జూన్ 1 నుంచి 3 వరకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 

'YSజగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు'

న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్‌ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్‌ గుజ్రాల్‌ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. 

తమను కాదని జగన్‌ కొత్త పార్టీ పెట్టుకున్నందుకే జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొల్పిందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. 

'YSజగన్ పై విమర్శలు చేస్తూ పైశాచికానందం'

కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని సంయమనంతో మాట్లాడాలని సలహా ఇచ్చారు. 

'తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తా':

కరీంనగర్ : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుంటానని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తనతో మాట్లాడారని ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వారు సూచించారని వివేక్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిసి స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఎంపీ రాజయ్యతో సహా అందరం టీఆర్ఎస్ లో చేరతామని మందా జగన్నాథం తెలిపారు.

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీమంత్రి మోపిదేవి

హైదరాబాద్ :వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

సిఎం,చంద్రబాబులపై విరుచుకుపడ్డ కేటీఆర్

అధిష్టానానికి డెడ్‌లైన్లు విధించవద్దన్న సిఎం వ్యాఖ్యలపై కేసీఆర్ కుమారుడు ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకు పడ్డారు. ప్రజాదరణ లేని, ప్రజామోదం లేని సిఎంగా కిరణ్ ఉండటం తెలుగు ప్రజలు, తెలంగాణవాళ్లు చేసుకున్న పాపమని కేటీఆర్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంకెంతకాలం తీర్చకుండా ఉంటారని ప్రశ్నించారు. కావూరి అలకబూనితే వెంటనే రాజీకి వెళ్లిన సిఎం కిరణ్, తెలంగాణ ఎంపీలు డెడ్‌లైన్ పెట్టినా కనీసం స్పందన లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సిఎం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలకు ఓ న్యాయం..ఆంధ్రా ఎంపీలకు ఓ న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు..లోకేష్ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. 

సిఎంపై యనమల విమర్శలు

అహ్లూవాలియా రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించడం వెనుక కిరణ్ తప్పుడు సమాచారం ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం అవినీతిలో కొట్టిమిట్టాడుతుంటే అభివృద్ధి పథంలో నడుస్తుందనడం హాస్యాస్పదమని యనమల అన్నారు. బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పథకాలకు కోత విధించి, కొత్త పథకాలు పెడతారా లేక ప్రజలపై మరోసారి పన్నుల భారం విధిస్తారా సిఎం స్పష్టం చేయాలని కోరారు. అహ్లూవాలియా మాటవరుసకు అన్న మాటలను ఏదో ప్రశంసించినట్లు సిఎం పేర్కోవడం గర్హనీయమని యనమల వ్యాఖ్యానించారు. 

Thursday 30 May 2013

ప్రార్ధనల కోసం జెరుసలెమ్ కు జోగి రమేష్

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ జెరుసలెమ్ వెళుతున్నారు.ఆయన ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ను ఉల్లంఘించి మరీ జగన్ కు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు ఆయన జెరుసలెమ్ కు వెళుతున్న కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ ను బెయిల్ రావాలని,వై.ఎస్.కుటుంబానికి మేలు జరగాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయడానికి తాను జెరుసలెమ్ వెళుతున్నట్లు ఆయన చెబుతున్నారు.గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి జెరుసలెమ్ వెళ్లి వస్తుండేవారు.

కేసీఆర్‌పై కేసు నమోదుకు ఖమ్మం కోర్టు ఆదేశం

ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై కేసు నమోదు చేసి జూన్ 28న కోర్టుకు దర్యాప్తు నివేదిక పంపాలని ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ గురువారం ఖమ్మం పోలీసులను ఆదేశించారు. ఈ ఫిర్యాదును ఖమ్మం న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి రామారావు కోర్టులో దాఖలు చేశారు. కేసు వివరాలివీ... 2013 జనవరి 28న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద జరిగిన సమరదీక్షను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగంలో దేశ ప్రధానమంత్రిని అగౌరవ పరుస్తూ ప్రసంగించారని రామారావు తన ఫిర్యాదులో వివరించారు. కేసీఆర్‌మాటలు దేశ ప్రజల ఆత్మగౌరవం, విశ్వాసాలను దెబ్బ తీశాయన్నారు. కాగా, కేసు నమోదు, దర్యాప్తు నిమిత్తం మెజిస్ట్రేట్ ఆదేశించగానే కొందరు న్యాయవాదులు గొల్లపూడి రామారావును దుర్భాషలాడటంతో పాటు ఆయనపై భౌతికదాడికి యత్నించారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఈఫిర్యాదు వెనుక టీడీపీ హస్తం ఉందని అర్థమవుతోందని న్యాయవాదుల జేఏసీ జిల్లా కన్వీనర్ తిరుమలరావు తెలిపారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబువన్నీ అసత్యాలే:జైళ్లశాఖ డీజీ

హైదరాబాద్: జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారంటూ, నీలి చిత్రాలు చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు స్పష్టం చేశారు. చంద్రబాబువి పూర్తి నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. జైళ్ల గురించి అవగాహనా రాహిత్యంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పలు వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జైళ్ల శాఖపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. 

దీనిపై జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి సారాంశం.. ‘‘జైళ్ల స్థితిగతులపై.. ముఖ్యంగా చంచల్‌గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని, జైళ్లలో ఖైదీలు మద్యం తాగుతూ, నీలి చిత్రాలు చూస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోపణలను పలు దినపత్రికల్లో కూడా ప్రచురించారు. ఈ విషయమై ఆయనకు తెలియజేయునది ఏమనగా... చంచల్‌గూడ జైల్లో స్పెషల్ క్లాస్ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తున్నాము. జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలూ కల్పించడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా తెలుగుదేశం పార్టీ వారు కోరిన ప్రతిసారీ సంబంధిత వివరాలను పారదర్శకంగా అందించాము. జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారని, నీలి చిత్రాలు చూస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తి అసత్యాలు. అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయం. భారత జైళ్ల వ్యవస్థలో మన్నికైన, ప్రతిభావంతమైనదిగా రాష్ర్ట జైళ్ల శాఖకు పేరుంది. అలాంటి జైళ్ల శాఖపై తీవ్ర ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనలు- 1979 మేరకు మానవ హక్కుల పరిరక్షణ కల్పనతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఈ శాఖను నిర్వహిస్తున్నాము. జైళ్ల శాఖపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వివరిస్తున్నాము’’

వరంగల్ ఎమ్.పి దారెటు

వరంగల్ కాంగ్రెస్ ఎమ్.పి సిరిసిల్ల రాజయ్య దారి ఎటు అన్నది చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన కూడా చేరవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తుండగా,భారతీయ జనతా పార్టీ కూడా ఆయనపై కన్నేసింది.తమ పార్టీలో చేరవలసిందిగా ఆ పార్టీ నాయకత్వం కోరగా చూద్దాం అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ స్థానాన్ని కడియం శ్రీహరికి ఇవ్వవలసి ఉన్నందున మానకొండూరు అసెంబ్లీని రాజయ్యకు టిఆర్ఎస్ ఆఫర్ చేసిందని అంటున్నారు.దానికి రాజయ్య అసంతృప్తి చెందారు.ఈ నేపధ్యంలో రాజయ్య బిజెపి ఆఫర్ ను స్వీకరిస్తారా?టిఆర్ఎస్ లోకి వెళతారా?కాంగ్రెస్ లోనే ఉంటారా అన్నది తేలవలసి ఉంది.

కాంగ్రెస్ టి.ఇవ్వదూ..కాని ఎలా వస్తుంది!

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత కె.కేశవరావు,ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ప్రకటించారు.అందువల్లనే తాము కాంగ్రెస్ ను వీడుతున్నామని చెప్పారు.ఇంతవరకు బాగానే ఉంది.తాము ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్న టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.అయితే ఇంతవరకు ఒకేగాని, కొందరు ఇతర పక్షాల నేతలు అడుగుతున్నట్లుగా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణ ఎలా వస్తుందన్నదానికి కేశవరావు వంటి నేతలు సమాధానం సమర్ధంగా చెప్పగలిగితే బాగుంటుంది.ఎందుకంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను కాదని అంటున్నారు. ఒకే.అదే సమయంలో తాము బిజెపితో పొత్తు పెట్టుకోబోమని టిఆర్ఎస్ ప్రకటించింది. అలాంటప్పుడు బిజెపితో కూడా వీరు కలవబోరు.ఈ రెండు పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నదానిపై కేశవరావు బహుశా భవిష్యత్తులో వివరణ ఇస్తే బాగుంటుంది.

రాజ్యసభకు ఐదోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నిక

గువాహటి: ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో ఆయనకు 49 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. అస్సాం నుంచి పోటీ చేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి శాంటియస్ కుజుర్‌కు 45 ఓట్లు లభించాయి. ఆలిండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) తరఫున పోటీచేసిన అమీనుల్ ఇస్లాంకు 18 ఓట్లు మాత్రమే దక్కడంతో ఓడిపోయారు. ఫలితాల వివరాలను అస్సాం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి జి.పి.దాస్ వెల్లడించారు. తొలి ప్రాధాన్యత ఓట్లు గల స్థానానికి ప్రధాని మన్మోహన్ మాత్రమే పోటీ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కాగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అస్సాం గణ పరిషత్, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగుకు దూరంగా ఉండిపోయాయి. 

ఈ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన 78 మంది ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఐదోసారి తనను రాజ్యసభకు ఎన్నుకున్న సందర్భంగా ప్రధాని మన్మోహన్ అస్సాం ప్రజలకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అస్సాం అభివృద్ధి కోసం తన కృషిని కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నాకు వేరే మార్గం లేదు: జానారెడ్డి

హైదరాబాద్: ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌తో పాటు సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌ను వీడి వెళ్లటం కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. ఎంత ప్రభావం ఉంటుందనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ వీడి వెళ్తున్న ఎంపీలతో పాటు మిగతా వారిని కూడా పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. తనకు వేరే మార్గం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతానని పేర్కొన్నారు. సహచర నాయకులు పార్టీ వీడి వెళ్లినప్పటికీ.. తమ మధ్య దూరం పెరగదన్నారు. ఉదయం కేకే తనతో సమావేశమైన సందర్భంగా తాను ఏం చెప్పాననేది వెల్లడించనని.. అది ఆయననే అడగాలని చెప్పారు. తాను హోంమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరగటం తనకే సిగ్గుచేటుగా ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవే కావాలని అడగలేదని, ఎన్నడూ ఫలానా శాఖ మంత్రి పదవి ఇమ్మని అడగలేదని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి పంచాయతీ ఎన్నికలపై చర్చించానని, శాఖల గురించి కాదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండు లేదా మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని, వారంలోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిస్తామని జానారెడ్డి తెలిపారు. జూలై తొలి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయన్నారు. 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ బదిలీ

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జూన్ ఏడో తేదీన తిరిగి తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర సర్వీస్ కు వెళ్లిపోతున్నారు.ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అధినేతగా నియమితులైనట్లు సమాచారం.గాలి జనార్ధనరెడ్డి కేసులో సంచలన అధికారిగా నమోదైన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జగన్ కేసులో కొంత వివాదాస్పదుడయ్యారు.ఈ కేసు రాజకీయ కేసుగా మారిపోవడంతో కొన్ని పొగడ్తలు,కొన్ని విమర్శలు స్వీకరించవలసి వచ్చింది.

మర్రి జనార్ధనరెడ్డి దారి టిఆర్ఎస్సే!

నాగర్ కర్నూల్ నుంచి కిందటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జెసి బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధనరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నారు.ఆయన బిజెపిలో చేరతారేమోనని ప్రచారం జరిగింది. కాని కేశవరావు, మందా జగన్నాధం,వివేక్ తదితరులతో పాటు ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.కాగా తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని కేశవరావు చెప్పారు.అయితే ఆయన కుమారుడు విప్లవ్ కుమార్,మందా జగన్నాధం కుమారుడు శ్రీనాధ్ కూడా కేశవరావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.కాగా టిడిపి మాజీ ఎమ్.పి మాణిక్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరుతుండడం విశేఫం.అలాగే భువనగిరి లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్న నరసయ్య గౌడ్ కూడా టిఆర్ఎస్ లో ప్రవేశిస్తున్నారని కధనం.కాగా ఇదే సీటుపై దృష్టి పెట్టుకున్న టిఆర్ఎస్ నేత శ్రావణ్ భవిష్యత్తు ఏమిటో తెలియాల్సి ఉంది.

Tuesday 28 May 2013

కెసిఆర్ పై హద్దుమీరి మాట్లాడిన మోత్కుపల్లి

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు హద్దులు దాటి మరీ విమర్శలు చేస్తున్నట్లుగా ఉంది.తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కూడా కొన్నిసార్లు ఇలాంటి విమర్శలు చేస్తుంటారు .కాని మోత్కుపల్లి ఆయన పరుషపదజాలాన్ని మించి మాట్లాడినట్లు కనబడుతుంది.కెసిఆర్ అంటే కింగ్ ఆఫ్ చీటర్స్ అండ్ రాబర్స్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఐదు వేల కోట్లు సంపాదించుకున్నాడని ఆరోపిస్తూ, తాగి,తాగి ఏమి మాట్లాడతావో తెలియని బుద్దిలేని వెదవవు నీవని ఆయన వ్యాఖ్యానించడం అంత పద్దతగా లేదు. తాగి ఫామ్ హౌస్ లో పడుకో అని కూడా ఆయన అన్నారు.కెసిఆర్ పేరులోనే లంగ,దొంగ అని ఉందని మోత్కుపల్లి ఘాటుగా మాట్లాడారు. కెసిఆర్,జగన్ లే లక్షల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.నేతలు హద్దులు దాటి మాట్లాడితే వారికే పరువు తక్కువ అవుతుందన్న సంగతిని మర్చిపోతున్నారు.

ఒక నేత అరెస్టు అయితే ముగ్గురు కొత్త నేతలు!

రాష్ట్ర రాజకీయాలు తమాషాగా మారుతున్నాయి.జగన్ ను జైలులో నిర్బందించి ఏడాది అయిన సందర్భంగా ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అందులో వై.ఎస్.కుటుంబీకులు విజయమ్మ, షర్మిల,భారతిలు పాల్గొనడం ఆసక్తికరంగా ఉంది.ఈ సందర్భంగా విజయమ్మ సిబిఐని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. హైకోర్టు జగన్ ఆస్తులపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని అడిగితే ఇరవైఎనిమిది బృందాలను ఆగమేఘాల మీద దింపి రెండు వారాలలో నివేదిక ఇచ్చిన సిబిఐ, ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా, దర్యాప్తునకు ఇంకా సమయం కావాలని అంటున్ నదని, ఇదంతా జగన్ ను జైలులో ఎక్కువ కాలం నిర్భందించాలన్న కుట్ర ప్రకారమే ఇది జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయానికి సిబిఐ సమాధానం చెప్పగలుగుతుందా అన్నది ప్రశ్న.సిబిఐ సుదీర్ఘకాలం తీసుకోవడం ద్వారా జగన్ రాజకీయ ప్రత్యర్ధులకు ఆ సంస్థ ఉపయోగపడుతున్నదన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తున్నది.ఇది ఒక కోణం అయితే విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కార్యక్రమాలకు వెళుతుంటే, షర్మిల సుదీర్ఘ పాదయమాత్ర చేపట్టి ఇప్పటికే రికార్డు సృష్టించారు. ఇక జగన్ కు మద్దతుగా జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా భారతి కూడా మున్నుందు అవసరమైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్న అభిప్రాయం కలుగుతుంది. మొత్తం మీద ఒక నేతను అరెస్టు చేస్తే, ముగ్గురు నేతలు తయారు అవుతున్నారన్నమాట.

మహాటీవీతో వైఎస్ భారతి

జగన్ భార్య వైఎస్ భారతి మొదటిసారిగా ఓ తెలుగుటీవీకి సుదీర్ఘ ఇంటర్య్వూ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్టు ఐ.వెంకట్రావుతో సంధించిన సూటి ప్రశ్నాలకు ఏమాత్రం తడబడకుండా
సూటిగా సుత్తి లేకుండా సమాధానాలించారు. జగన్ అమ్ములపోదిలో మరో అస్త్రాం ఉందని వైఎస్ అభిమానులకు తెలియజేశారు. జగన్ రాజకీయ కారణాలతోనే జైలులో ఉన్నారని
ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి ఆనం వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధకల్గించాయని వ్యాఖ్యానించారు జగన్ జైలులో ఉండటం పిల్లలని ఇబ్బందులు పెడుతున్నయని
వ్యాఖ్యనించారు. జగన్ ఇచ్చిన ధైర్యంతోనే విజయమ్మ,షర్మిల నేను ముందుకు పోతున్నామని వైఎస్ మాదిరిగా జగన్ చాలా ఆలోచన పరుడని మంచి వ్యాపారవేత్తని తెలిపారు. జనంకోసం 
ఎంతటికైనా పోరాడుతామని జగన్ జీవితంలో చీకటి ఎంతో కాలం ఉండదని త్వరలోనే వెలుగులు వస్తాయని ఆమె నమ్ముతున్నారు. 

ఎవరి వల్ల ఎవరు ఓడిపోయారో!

రెండువేల నాలుగులో బిజెపి వల్ల నష్టపోయామని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడుపై బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నడైనా ఆయన సొంతంగా గెలిచారా అని ప్రశ్నించారు.1999లో తమ పొత్తు వల్ల గెలిచిన టిడిపి, ఇప్పుడు బిజెపి వల్ల ఓడామని చెప్పడం విడ్డూరం అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.2004లో టిడిపి వల్లనే తాము నష్టపోయామని కిషన్ వ్యాఖ్యానించారు.తమతో పొత్తుపెట్టుకున్నప్పుడు మత తత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.ఇక్కడ విశేషం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణ టిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకరరావు తాము బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు సంకేతం ఇస్తే చంద్రబాబు మాత్రం అలాంటి పొత్తు ఉండదని చెబుతున్నారు.నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదో ఒక ముఖ్యమైన పార్టీలో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఉందని, అది బిజెపి అయితే బెటర్ అని పార్టీలో కొందరి భావన.కాని అంతకుముందు ఆ పార్టీపై చేసిన విమర్శలతో ఆ విషయంలో ముందుకు వెళ్లడానికి టిడిపి ఇబ్బంది పడుతోంది.ఇంతకీ ఎవరి వల్ల ఎవరు ఓడారంటారు?

163వ రోజు పాదయాత్ర ప్రారంభించిన YSషర్మిల

పాలకొల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటికి 163వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె పాలకొల్లు బ్రాడీపేట నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర జిన్నూరు, వేడంగి మీదగా పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుకుంటుంది. ఈరోజు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.

మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పేరుకు అధికారిక సమావేశం కోసం హస్తిన పర్యటన ఉన్నా అందరి అంచనాలు మాత్రం మంత్రివర్గంలో మార్పు చేర్పుల చుట్టే తిరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిల తొలగింపు తర్వాత ఇంకా వేట్లు ఉంటాయా? కొత్తగా మంత్రివర్గంలో ఎవరైనా చేరుతారా.. లేదంటే అసెంబ్లీ సమావేశాలపేరుతో మరికొంత కాలం సాగతీస్తారా తేలాల్సిఉంది. 

రాహుల్ గాంధీకి కోపమొచ్చింది...

రాయపూర్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ సర్కారుపై, అక్కడి ఉన్నతాధికారులపై తన కోపాన్ని ప్రదర్శించా రు. కాంగ్రెస్ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి దరిమిలా రాజ్‌భవన్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో రాహుల్ కూడా పాల్గొన్నారు. సమావేశం మొదలైన కొద్దిసేపటికే, ‘దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ రాహుల్ ఆగ్రహంగా ప్రశ్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన సంఘటనపై ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. అయితే, ఆయన ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించకపోవడంతో ఎవరు స్పందించాలో తోచక అధికారులెవరూ బదులివ్వలేదు.

ముఖ్యమంత్రి కూడా సహనంతో మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత ప్రధాన కార్యదర్శి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. రాహుల్ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో ప్రధాన కార్యదర్శి స్పందించారు. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అధినేతగా జరిగిన లోపాలకు బాధ్యత వహించేందుకు సంసిద్ధంగా ఉన్నానని, తన రాజీనామాతో సమస్య పరిష్కారం కాగలదనుకుంటే, అందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో రాహుల్ మౌనం వహించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడికి బాసటగా నిలుస్తూ, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించడంలో వైఫల్యంపై ఛత్తీస్‌గఢ్ అధికారులను నిలదీశారు. ఈ దశలో రమణ్ సింగ్ జోక్యం చేసుకుని, కాంగ్రెస్ నేతలకు రక్షణ కల్పించామని, వారికి కల్పించే భద్రతా సిబ్బందిని కూడా తగ్గించలేదని చెప్పారు.

ఛత్తీస్‌గఢ్ అధికారుల రుసరుసలు: సమీక్ష సమావేశంలో రాహుల్ తీరుపై ఛత్తీస్‌గఢ్ అధికారులు రుసరుసలాడుతున్నారు. పాలకపక్షానికి ఆయన పెద్ద బాస్ అయితే కావచ్చునని, కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్రంలో గానీ ఆయనకు ఎలాంటి అధికార హోదా లేదని, అలాంటప్పుడు సమీక్ష సమావేశంలో పాల్గొనే అవసరమే ఆయనకు లేదని ఛత్తీస్‌గఢ్ అధికారి ఒకరు అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక పర్యటనలో భాగంగా సోనియా, రాహుల్ రాజ్‌భవన్‌కు అతిథులుగా వచ్చారని అన్నారు. అయితే, సమీక్ష సమావేశంలో ఎవరు పాల్గొనాలనేది గవర్నర్ విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్ర నేడు సాగేదిలా

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 163వ రోజు బుధవారం 11 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకొల్లు బ్రాడీపేట నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పోడూరు మండలం కవిటం గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు : పాలకొల్లు బ్రాడీపేట, జిన్నూరు, వేడంగి, కవిటం.

మహానాడుకు దూరంగా హరికృష్ణ, జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరయ్యారు. మహానాడు తొలిరోజైన సోమవారం హాజరైన హరికృష్ణ రెండో రోజు ఆ దరిదాపుల్లోకి రాలేదు. మహానాడులో రెండో రోజున పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే మంగళవారం మహానాడులో జరిగిన ఎన్టీఆర్ జయంతికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవటం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం వరకూ ఉండి వెళ్లిపోయారు.

కాగా, మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు జూనియర్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులోని తాత సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు ‘మీరు మహానాడుకు హాజరవుతున్నారా?’ అని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదు కాబట్టి వెళ్లటం లేదని.. ఒకవేళ ఇపుడు పిలిచినా వెళతానని ఆయన బదులిచ్చారు. అయితే ఆయన్ను పార్టీ వర్గాలు ఆహ్వానించకపోవటంతో మహానాడు ముగిసే వరకూ రాలేదు. ఎన్టీఆర్ కు ఆహ్వానం అందక పోవటంపై మహానాడు ఆహ్వా న కమిటీ చైర్మన్ పి.అశోక్‌గజపతిరాజు వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పంపామని చెప్పారు. ఇదే విషయమై టీడీపీ కార్యాలయవర్గాలు మాత్రం.. వారికి ఆహ్వనం పంపామని కొద్ది సేపు.. పార్టీ నేతలకు మాత్రమే ఆహ్వానాలు పంపుతామని, కుటుంబసభ్యులను ఎపు డూ ఆహ్వానించేది లేదని మరికొద్ది సేపు చెప్పారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: YS విజయమ్మ

హైదరాబాద్ : ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె అన్నారు. సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. 

జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారం ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత తమ కుటుంబం ఎన్నో బాధలు పడిందన్నారు. తమ మానసిక స్థితి చూసి కొందరు ఆనందిస్తున్నారని విజయమ్మ అన్నారు.

విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. బాబుకు విశ్వసనీయత ఉంటే తెలుగుదేశం పార్టీ అలా ఉండేది కాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని విజయమ్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

జనం కోసం పోరాడినందుకే జగన్ కు జైలు:YS భారతి

హైదరాబాద్ : ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని జైలులో పెట్టారని ఆయన సతీమణి భారతి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భారతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడేవారు ఉండకూడదన్నదే వారి ఉద్దేశమని, అందుకే జగన్ ను జైలుకు పంపారని చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అన్నారు. దేవుడు ఉన్నాడు, న్యాయం తప్పక జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని తెలిపారు. ఈ రోజు మంత్రులుగా ఉన్నవారందరూ రాజశేఖర రెడ్డి వల్లే మంత్రులయ్యారని చెప్పారు. వైఎస్ కుటుంబాన్నే ఇన్ని కష్టాలు పెడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని భారతి ప్రశ్నించారు.

వైఎస్ అభిమానులందరూ అండగా నిలవాలి

శ్రీకాకుళం: ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి వైఎస్ అభిమానులంతా అండగా నిలవాలని ఆ పార్టీ నేతలు పిలుపు ఇచ్చారు. జగన్ నిర్బంధానికి నిరసన తెలుపుతూ శ్రీకాకుళంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలలో ఆ పార్టీ నేతలు ధర్మాన కృష్ణదాస్, సాయిరాజ్, కుంభా రవిబాబు, విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, వరుదు కల్యాణి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కెసిఆర్ ఓడిపోతేనే తెలంగాణ:పాల్వాయి గోవర్ధన రెడ్డి

హైదరాబాద్ : టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి అన్నారు. తెలంగాణపై టిఆర్ఎస్ కు, టిడిపికి చిత్తశుద్ధిలేదన్నారు. తెలంగాణ ఇవ్వడం లేదనే కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడుతున్నారని చెప్పారు. చంద్రబాబు వాగ్దానాలు అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలని అన్నారు. 

సర్కార్ ఫోన్ టాపింగ్ చేస్తోంది: శంకర్రావు

హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి తన ఫోన్ సంభాషణలను టాపింగ్ చేస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శంకర్రావు ఆరోపించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఛార్జిషీట్ లో పేర్లు ఉన్న మంత్రులు ప్రభుత్వంలో ఉంటే ఛార్జిషీట్ వేయకుండా జగన్ మోహన్ రెడ్డిని జైల్లోకి పంపారని అన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని శంకర్రావు వ్యాఖ్యానించారు.

ముగిసిన చంద్రబాబు చాప్టర్:తులసిరెడ్డి

హైదరాబాద్ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చాప్టర్ ముగిసిందని 20 సూత్రాల పథకం చైర్మన్ తులసి రెడ్డి అన్నారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో చంద్రబాబు కాలం చెల్లిన విధానాలు పాటిస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నిరసన దీక్షలు

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంగళవారం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే కాకినాడలో పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో గొల్ల బాబురావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బొడ్డు భాస్కర రామారావు, కుడిపూడి చిట్టబ్బాయ్, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణస్వామి, అమర్ నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ దీక్షకు దిగింది. ఈ దీక్షకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి,కడప ఇంఛార్జ్ అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు.

మచిలీపట్నంలో వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు దీక్షకు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, కుక్కల నాగేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. కర్నూలులో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీమంత్రి మారెప్ప, చక్రపాణిరెడ్డి దీక్ష చేపట్టారు.

ఆదిలాబాద్ లో చేపట్టిన నిరసన దీక్షలో బోడ జనార్థన్, జనక్ ప్రసాద్, కోనేరు కోనప్ప, సోయం బాబూరావు పాల్గొన్నారు. అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షతో ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత, వై. విశ్వేశ్వరరెడ్డి కూర్చున్నారు. నిజామాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి దీక్ష చేపట్టారు. 

విశాఖలో వైఎస్ఆర్ సీపీ చేపట్టిన దీక్షలో దాడి వీరభద్రరావు, వంశీకృష్ణయాదవ్, గండి బాబ్జీ, చెంగల వెంకట్రావ్, ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు.మరోవైపు ఏడాది నుంచి వైఎస్ జగన్‌ అక్రమ నిర్బంధానికి నిరసనగా కూకట్‌పల్లి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ నేత వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

దీక్ష ప్రారంభించిన వైఎస్ విజయమ్మ

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌ అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన దీక్షలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పాల్గొన్నారు. మహానేత వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. జగన్ సతీమణి వైఎస్‌ భారతి కూడా దీక్షలో పాల్గొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానాలు దీక్షకు తరలి వచ్చారు. 

2014లో YSజగన్ ను సీఎం చేద్దాం:కొండా దంపతులు

వరంగల్: వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని 2014
ఎన్నికలలో ముఖ్యమంత్రిని చేద్దామని కొండా మురళీ, సురేఖ దంపతులు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. వైఎస్ఆర్ చేసిన మేలు కొందరు మరచిపోవచ్చు గానీ, ఆయన సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందినవారు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. 

మహానాడుకు ఆహ్వానం అందలేదు:జూ.ఎన్టీఆర్

హైదరాబాద్ : మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 90వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ దగ్గర ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులు అర్పించారు. ఆయన మంగళశారం ఉదయం సతీసమేతంగా ఘాట్‌కు చేరుకుని తాతకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మళ్లీ జన్మలోనూ ఎన్టీఆర్‌ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. 

మహానాడుకు ఆహ్వానం అందలేదని...... అందితే... హాజరవుతానని ఎన్టీఆర్‌ తెలిపారు. 2014 టిడిపి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. టిడిపి కోరితే ప్రచారం చేయటానికి సిద్ధంగా వున్నానని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగుజాతి బతికున్నంత కాలం మర్చిపోలేని నేత ఎన్టీఆర్ అని, భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. 

Monday 27 May 2013

జగన్ కోసం జనం... ఫోటో గ్యాల‌రీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, నిరాధారమైన ఆరోపణలతో, కుట్రలు కుతంత్రాలతో అరెస్టుచేసి ఏడాది కాలం పూర్తయింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని జననేతకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసించారు. జగన్‌మోహన్‌రెడ్డి జనంలోఉంటే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోవడం అసాధ్యమని భావించిన అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు చీకటి ఒప్పందానికి వచ్చి ఆయన్ను అక్రమంగా జైలుకు పంపించాయని వైఎస్సార్సీపీ నేతలు పలువురు ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలతో జగన్‌ను ఏడాది పాటు జైల్లో నిర్బంధించడమే గాక నిబంధలనకు విరుద్ధంగా చార్జిషీట్లు వేస్తూ సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో సీబీఐ నడుచుకుంటూ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తుండ డాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో వారు తగు విధంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 










పాలకొల్లులో నేడు YSషర్మిల నిరసన దీక్ష

పాలకొల్లు, న్యూస్‌లైన్ : జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది దాటిన నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన సోదరి షర్మిల మంగళవారం పాలకొల్లులో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆమె పాలకొల్లులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. షర్మిలతోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దీక్ష విరమించడానికి ముందు ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడతారని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన నిలవడమే తప్పా?: YS భారతి

హైదరాబాద్: ప్రజల పక్షాన నిలబడినందుకే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి అన్నారు. తమ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. వైఎస్‌ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... అరెస్టయిన వ్యక్తికి చట్టం ప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని, కానీ జగన్ ను అరెస్ట్ చేసి ఏడాది పూర్తయినా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు మొదలు పెట్టి రెండేళ్లవుతున్నా జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదని భారతి అన్నారు. విచారణ చేయకుండానే జగన్ ను మొదటి ముద్దాయిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. ఒక ప్రశ్న అడగకుండానే మూడు చార్జిషీట్లు వేశారన్నారు. 

ప్రజలతో ఉండాలనుకోవడమే తాము చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. జైల్లో ఉన్న జగన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడివుంటానని చెప్పారన్నారు. 

నెక్లెస్‌రోడ్‌ చేరుకున్న YS జగన్ కుటుంబ సభ్యులు

హైదరాబాద్: వైఎస్‌ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తు ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. జగన్ కు మద్దతుగా భారీగా వచ్చిన జనంతో నెక్లెస్‌రోడ్‌ అభిమాన సంద్రంగా మారింది.

పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. వేదిక దగ్గరకు వచ్చిన జగన్ కుటుంబ సభ్యులను అభిమానులు చుట్టుముట్టారు. కాసేపట్లో ర్యాలీ ప్రారంభమవుతుంది. 

చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు చంచలగూడ జైలు వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిర్బంధాన్ని నిరసిస్తూ వారు ఈ ప్రదర్శన చేస్తున్నారు. జైజగన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

మధుయాష్కి ఆరోపణల మతలబు

మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని పొగుడుతారో అర్దం కాని రాజకీయాలు ఏర్పడ్డాయి.గతంలో పొగిడిన, లేదా విమర్శించిన విషయాలను మర్చిపోతుంటారన్న సంగతి మధు యాష్కి వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.మధు యాష్కి తనను కెసిఆర్ గతంలో తెలంగాణ జాతి రత్నం అన్నారని, ఇప్పుడు తెలంగాణ బుడ్డర్ ఖాన్ అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.సీట్లు ,నోట్లు,ఓట్ల రాజకీయం చేస్తున్న కెసిఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తాను ల్యాంకోలో పెట్టుబడులు పెట్టలేదని,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని, న్యూజెర్సీలో స్ట్రిప్ మాల్ కొనలేదని, బతకమ్మ పేరుతో కోట్లు వసూలు చేయలేదని అన్నారు. శాసనసభ ఉప సభాపతి అయినప్పుడు కెసిఆర్ ఆస్తులెంత?ఇప్పుడు ఆస్తులు ఎంత విచారణకు సిద్దమా?అని మధుయాష్కి సవాలు చేశారు.కేవలం కాంగ్రెస్ ఎమ్.పిలను టిఆర్ఎస్ లోకి వెళ్లకుండా తాను అడ్డుపడుతున్నానని భాధతోనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.వంద సీట్లు వస్తేతెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మొత్తం మీద కెసిఆర్ కుటుంబానికి చెందినవారి పై ఆ పార్టీ నుంచి సస్పెండైన రఘునందనరావు తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తే, కాంగ్రెస్ ఎమ్.పి మధు కొత్త ఆరోపణలను గుప్పించి కెసిఆర్ ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించడం విశేషం

Sunday 26 May 2013

ఆంధ్రప్రదేశ్ కొత్త హోంమంత్రి ?

దాల్మియాకేసులో సబితా ఇంద్రారెడ్డి రాజీనామా ఆమోదించడంతో కొత్త హోం మంత్రి ఎవరన్నదానిపై ఊహాగానాలకు తెరలేసింది. ఈ పదవి కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్ మంత్రులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ఇప్పటికే మొదలు పెట్టారు. ఢిల్లీ పైరవీలు చేస్తున్నవారిలో జానారెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శశిధర్ రెడ్డిలుండగా సిఎం మాత్రం మరోముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిఎం మొగ్గుచూపుతున్న వారిలో డికె అరుణ, శ్రీధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డిలున్నారు. అయితే ఎక్కువగా దామోదర లేక డికె అరుణ లేదా శ్రీధర్‌బాబులకే ఎక్కువగా అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 

చంద్రబాబు అవిశ్వాసంపై అనుమానాలు

చంద్రబాబు పెడతానంటున్న అవిశ్వాసంపై వైఎస్సార్‌సిపి నేత శోభానాగిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. మొన్నటి అవిశ్వాసంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు లోపాయికారి ఒప్పందం ప్రకారం అవిశ్వాసం పెడతానని బీరాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. మొన్నటి అవిశ్వాసంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయించి ఇప్పుడు అవిశ్వాసం పెడతానని చెప్తున్నారన్నారు. ఒకవైపు అవిశ్వాసం పెడతానంటూనే మరోవైపు సర్కారుకు మెజార్టీ ఉందని వ్యాఖ్యానించడాన్ని శోభానాగిరెడ్డి తప్పుపట్టారు. రాజకీయ కుట్రలో భాగంగానే జగన్‌ను ఏడాదిపాటు జైలులో పెట్టారని ఆమె విమర్శించారు.

ప్రధానికి సంబంధంలేదు-YS జగన్ కు సంబంధం ఏమిటి?

హైదరాబాద్: కేంద్రంలో జరుగుతున్న కుంభకోణాలతో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 26 జిఓలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధం ఏమిటని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ప్రశ్నించారు. జగన్ తో ఒక్కసారి కూడా మాట్లాడకుండానే సిబిఐ అధికారులు మూడు ఛార్జీషీట్లు ఎలా వేశారు? ఏ1 నిందితుడిగా ఎలా చేర్చారు? అని ఆయన అడిగారు. 

జగన్ బెయిల్ కోరిన ప్రతిసారి భారీ కుంభకోణంగా చిత్రీకరిస్తూ సిబిఐ అడ్డుపడుతోందని విమర్శించారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తికాకున్నా బెయిల్ ఇవ్వాలన్న నిబంధన చట్టంలో ఉందని తెలిపారు. సంవత్సరమైనా బెయిల్ ఇవ్వకుంటే ఆ నిబంధన ఎందుకు ఉన్నట్లు? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ లలను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వ్యతిరేకించినందుకు జగన్ ను వేధిస్తున్నారని చెప్పారు.

ధర్మాన ప్రసాద రావు, సబితల రాజీనామా ఆమోదం

హైదరాబాద్: మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబిత ఇంద్రారెడ్డి రాజీనామాలను ఆమోదించారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆమోదించారు. చడీచప్పుడులేకుండా ఈ ప్రక్రియ జరిగిపోయింది. 

మంత్రుల రాజీనామాలకు సంబంధించి గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.

ఇది ఒక చీకటి రోజు: ప్రధాని మన్మోహన్ సింగ్

రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో గాయపడి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. బస్తర్ జిల్లాలోని దర్భాఘాట్ వద్ద కాంగ్రెస్ నేతల కాన్వాయ్ పై మావోయిస్టులు మెరుపు దాడిచేసి పలువురిని హతమార్చిన విషయం తెలిందే. ఈ ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వారిని పరామర్శించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అన్నారు. హింసకు వ్యతిరేకంగా యావత్ జాతి ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు.

రాజకీయ వేధింపుల్లో భాగంగానే జగన్ అరెస్ట్

హైదరాబాద్: రాజకీయ వేధింపుల్లో భాగంగానే కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు. విచారణ పేరిట వైఎస్ జగన్ ను జైల్లో ఉంచి సోమవారాని ఏడాది పూర్తి అవుతుందని తెలిపారు. సీబీఐ తీరుకు నిరసనగా సోమ, మంగళవారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

మంగళవారం ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు హాజరయ్యే కార్యకర్తల కోసం వేసవితాపం తట్టుకునేలా ఏర్పాటు చేయాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి సూచించారు. 

అవిశ్వాస సమయంలో చంద్రబాబు సర్కారుకు అండగా నిలిచారని ఆమె ఆరోపించారు. అదే ప్రభుత్వంపై బాబు ఇప్పుడు అవిశ్వాసం పెడతానంటున్నారని, మరో వైపు సర్కార్ బలంగా ఉందంటున్నారని బాబు వ్యాఖ్యలను ఆమె ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాకే బాబు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారని అన్నారు. 

ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలపక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ క్రాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా శోభానాగిరెడ్డి తెలిపారు. 

ఎంపి గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్గొండ: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఏపీలో కూడా ఛత్తీస్ గఢ్ లాంటి ఘటనలు జరుగుతాయని హెచ్చరించారు. ఛత్తీస్ గఢ్ లో నిన్న మావోయిస్టుల దాడిలో 30 మంది కాంగ్రెస్ నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ సంఘటన ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన అన్నారు.

Saturday 25 May 2013

జనం గుండెల్లో YSజగన్

* ఆయనలో తమ నాయకుణ్ని చూసుకుంటున్న ప్రజలు
* మాటపై నిలిచి తండ్రి వైఎస్‌ను తలపించిన తనయుడు

అన్నింటా విఫలమవుతూ వస్తున్న అధికార పార్టీ. అన్ని విలువలకూ పాతరేసి మరీ దానితో అంటకాగుతున్న
ప్రధాన ప్రతిపక్షం. ఫలితంగా రాష్ట్రాన్ని ఆవరించిన రాజకీయ శూన్యం. దాన్ని భర్తీ చేసేందుకు మహా ప్రభంజనంలా దూసుకొచ్చారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తిరుగులేని శక్తిగా, ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అందుకోసం నిత్యం ఏటికి ఎదురీదారు. అనునిత్యం పోరాటాలు చేశారు. ఇంత స్వల్పకాలంలో జగన్ ఈ స్థాయికి ఎదిగారంటే అందుకు కారణాలు అనేకం. ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన మాట తప్పని జగన్‌లో ‘మడమ తిప్పని వైఎస్’ను చూసుకున్నారు జనం. తమ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరులో నాయకున్ని చూశారు జనం. అధికార, విపక్ష శక్తులు అక్రమంగా నిర్బంధించినా... తల్లిని, చెల్లిని తమకు మారుగా తమ మధ్యకు పంపిన జగన్‌లో అణువణువునా ఆత్మీయ నేతను దర్శిస్తున్నారు జనం. అలా వారి మనసు చూరగొని, తిరుగులేని జననేతగా ఎదిగిన జగన్ అనే మూడక్షరాలను వింటే చాలు, కుమ్మక్కు పార్టీలకు ఎక్కడ లేని జంకూ పుడుతోందిప్పుడు...

కుట్రలను పటాపంచలు చేస్తూ, కుమ్మక్కులను కూకటివేళ్లతో పెకిలిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా దూసుకొచ్చింది. ప్రజా నాయకునిగా జగన్ ఎదగడం, ఆయన స్థాపించిన పార్టీ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేయడం ఒక్క గంటలోనో... రోజులోనో జరిగిన పరిణామం కాదు. దానివెనుక సుదీర్ఘ ప్రస్థానముంది. దాని ఆవిర్భావం వెనుక మొక్కవోని ఆశయముంది. అన్నింటికీ మించి అడుగడుగునా ప్రజల అండదండలున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత అతి కొద్ది కాలంలోనే శరవేగంగా జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్న వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఆయన కుటుంబాన్ని వేధించేందుకు జరిగిన కుట్రలు... తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తనయుణ్ని ఏం చేసైనా ప్రజలకు దూరం చేసేందుకు పన్నిన కుతంత్రాలు... వీటన్నింటి మధ్య జన్మించిన రాజకీయ శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

ఎన్నికల ఆరాటం కాదు..
వైఎస్సార్‌సీపీని స్థాపిస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రోజున కాదు కదా, కనీసం సమీప భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఎన్నికలనేవే లేవు. అయినా సరే, ఎక్కడ పీఠం కదిలిపోతుందోనన్న భయం అధికార పక్షానిది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు దూరమైన అధికారం శాశ్వతంగా అందకుండా పోతుందేమోనన్న ఆందోళన ప్రధాన ప్రతిపక్షానిది. రెండూ కలసికట్టుగా ఎంతగా గొంతు చించుకున్నా, ఎన్నో కుట్రలు చేసినా జగన్ నిత్యం జనం మధ్యే తిరిగారు. వారిలో ఒకడయ్యారు. వారి కష్టనష్టాల్లో పాలుపంచుకున్నారు. దాంతో ఏం చేసైనా సరే జగన్‌ను, వైఎస్సార్‌సీపీని అణిచేయడమే లక్ష్యంగా.. శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ప్రజాదరణతో దూసుకుపోతున్న జగన్‌ను, ఆయన పార్టీని వారికి దూరం చేయలేక తెరవెనుక కుట్రలకు తెర తీశాయి. ఆయన కుటుంబాన్ని విడదీయజూశాయి. కడప లోక్‌సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచినప్పుడు రెండు పార్టీలూ కుట్రలకు మరింత పదును పెట్టాయి. వైఎస్ కుటుంబంలో చీలిక తేవడానికి ఒక పార్టీ పని చేస్తే, ఎలాగైనా వారిద్దరినీ ఓడించేందుకు ఆ పార్టీకి లోపాయికారీగా మద్దతిచ్చింది టీడీపీ. వాటి కుయుక్తులకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారు. జగన్‌కు రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టి వాటికి గుణపాఠం నేర్పారు. తర్వాత 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీని అడ్డుకునేందుకు రెండు పార్టీలూ కలిసి నానా గడ్డీ కరిచినా జనం మరోసారి కర్రు కాల్చి వాత పెట్టారు. తాజాగా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా పక్షాన నిలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారంటే.. విప్ ధిక్కరించినందుకు తమపై తక్షణం అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలని బహిరంగంగా డిమాండ్ చేశారంటే.. దాని అర్థమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

...అప్పుడే తెర లేచింది
మాటకు కట్టుబడి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేస్తూ, మహా నేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పేరుపేరునా ఇంటికెళ్లి పరామర్శిస్తున్న తరుణంలోనే కుట్రలకు తెర లేచింది. ఢిల్లీ స్థాయిలో అడ్డంకులొచ్చాయి. జన నేతకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు, ఆ ప్రభంజనం ముందు తాము కొట్టుకుపోవడం ఖాయమని భయపడ్డ టీడీపీ నాయకత్వం చేతులు కలపడంతో ఉమ్మడి కుట్రలకు అంకురార్పణ జరిగింది. జగన్ మాటపై నిలవకపోయినా, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు విన్నా ఈ రోజు ఆయన జైల్లో ఉండేవారే కాదు. స్వేచ్ఛగా పదవులు అనుభవిస్తూ ఉండేవారు. పార్టీ చెప్పినట్టు విని, ఏడాది ఆగితే జగన్ కేంద్ర మంత్రి, తర్వాత సీఎం కూడా అయ్యేవారని స్వయంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో గులాంనబీ ఆజాదే చెప్పినా... అధిష్టానం మాట విని ఉంటే జగన్‌పై ఈ కేసులు ఉండేవే కాదని మరో కాంగ్రెస్ నాయకుడన్నా... సారాంశం మాత్రం సుస్పష్టం. కానీ ఇదంతా జరగాలంటే జగన్ ఒకే ఒక పని చేయాలి. కాంగ్రెస్ మాట వినాలి. అంటే తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన అభిమానుల కుటుంబాలను స్వయంగా ఓదారుస్తానంటూ తానిచ్చిన మాట తప్పాలి. కానీ... అలా మాట తప్పడం జగన్ కుటుంబంలోనే లేదు. అందుకే ఆనాడు వైఎస్ జగన్ కళ్లెదుట కన్పించింది ఈ పదవులూ, ప్రలోభాలూ కాదు. కేవలం తన తండ్రి, ఆయన ఆశయాలు మాత్రమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు మాత్రమే.

పార్టీ ప్రస్థాన దిశలో...
ఆ రోజు.... ఆయన ఈ కుటిల రాజకీయాల గురించి ఆలోచించలేదు. కుళ్లిన కుట్రలపై దృష్టి సారించలేదు. అప్పటికి ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. నల్లకాలువ సభలో ‘‘రాజశేఖరరెడ్డి చనిపోతూ... ఆయన నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు...’’ అని చెప్పిన జగన్... ఆ రోజు నుంచీ తన లక్ష్యమేంటో... తన దారేంటో... తన మాటేంటో... దాని కోసమే తపించారు. మాటపై నిలిచి, దివంగత నేత లక్ష్యసాధన కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కుట్రలు పుట్టుకొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా... ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా వెనక్కి తిరిగి చూడలేదు జగన్. లక్ష్యం దిశగా ముందుకు నడవడాన్నే జీవితంగా మార్చుకున్నారు. ఇచ్చిన మాట... దానికోసం మేరునగంలా నిలబడిన తీరు... ఎంచుకున్న బాట... ఇవే ఈ రోజు జగన్‌ను ప్రజల్లో నిలబెట్టాయి. తమ బాధలు తీర్చేవారి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు జగన్‌లో తమకు పెద్ద దిక్కును చూసుకున్నారు. తమ నాయకుణ్ని చూసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. జగన్ బలమైన శక్తిగా అవతరించడానికి కారణమైంది. యాదృచ్ఛికమే అయినా.. జగన్ వేసిన తొలి అడుగులే... పలికిన తొలి పలుకులే పార్టీ ఏర్పాటుకు నాంది పలికినట్టయింది. కుట్రలు, కుతంత్రాల్లో ఇమిడేందుకు ఇష్టపడక, ప్రజల పక్షాన నిలవడానికి పార్టీని ఏర్పాటు చేసే దిశగా పరిస్థితులే జగన్‌ను నడిపించాయి.

జగనే ఎందుకు?
మూడు పదులు దాటిన వయసులో తనకెందుకీ బాధలనే ఆలోచనను జగన్ ఒక్కరోజు కూడా తన మదిలోకి రానివ్వలేదు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన తండ్రికి కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు.. ఇంకెన్నో కుట్రలు.. మొత్తంగా ముళ్ల బాటే ముందుందని ముందే తెలుసు. అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయనీ తెలుసు. అయినా ఆయన దేనికీ వెరవలేదు. తన తండ్రి దేనికోసమైతే పరితపించారో.. ఏ లక్ష్యం కోసం పని చేశారో.. దాని సాధనే ధ్యేయంగా ముందుకు సాగడాన్నే తొలి కర్తవ్యంగా ఎంచుకున్నారు.

ఒకవైపు ఓదార్పు... మరోవైపు పోరాటం...
తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను ఒకవైపు పరామర్శిస్తూనే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతోనూ పోరాటం చేశారు జగన్. ప్రతి సమస్యపైనా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యల బాట పట్టిన చేనేత కార్మికుల కోసం 2010 డిసెంబర్ 20న విజయవాడలో 48 గంటల పాటు లక్ష్య దీక్ష చేపట్టారు. నదీ జలాల వాటాలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ పెద్దలను నిలదీసేందుకు 2011 జనవరి 22న హస్తినలో జల దీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ 2011 ఫిబ్రవరి 6న పోలవరం కోసం హరితయాత్ర చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం గండికొడుతున్న తీరును చూడలేక ఫిబ్రవరి 18న ఫీజు పోరు పేరుతో వారం రోజులు నిరాహార దీక్ష చేశారు.రైతు సమస్యలను ఎలుగెత్తుతూ మే 17న రైతు దీక్షకు పూనుకున్నారు. వారి సాగు కష్టాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు జూన్ 13న చిత్తూరులో, గ్యాస్ ధరల తగ్గింపు కోసం జూన్ 30న అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఇలా ఒకటేమిటి... వైఎస్ మరణానంతరం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, ఇబ్బందుల్లో అడుగడుగునా వారి వెంటే నిలిచారు.

పోరాటాలను నిర్బంధించలేవు
కుమ్మక్కు కుట్రలు ఏడాదిగా జైల్లో నిర్బంధించినా, జగన్ ప్రజలకు ఏనాడూ దూరమైంది లేదు. తల్లికి, చెల్లికి కర్తవ్యం
వివరించారు. వారి రూపంలో నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ విజయమ్మ నిత్యం పోరాడుతున్నారు. అన్న మార్గనిర్దేశకత్వంలో, తండ్రి బాటలో షర్మిల చరిత్రాత్మకం, సాహసోపేతం అయిన పాదయాత్ర సాగిస్తున్నారు. జనం కూడా విజయమ్మలో, షర్మిలలో జగన్‌ను చూసుకుంటున్నారు. విజయమ్మ కూడా... విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్... ఇలా ఒకటని కాకుండా అన్ని ప్రజా సమస్యల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.

తండ్రి బాటలోనే...
వైఎస్ ఎప్పుడూ ప్రజలనే నమ్ముకున్నారు. 2009 ఎన్నికలప్పుడు ఇతర పార్టీలన్నీ ప్రచారం కోసం సినీ స్టార్లను నమ్ముకున్న వేళ... రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది లబ్ధిదారులే తమ పార్టీకి స్టార్ ప్రచారకులని సంపూర్ణ నమ్మకంతో చెప్పారాయన. ఫలితాల రూపంలో జనం దాన్ని అక్షరాలా నిజం చేసి చూపారు. జగన్ కూడా సరిగ్గా తండ్రి అడుగుజాడల్లోనే, జనంపై అచంచల విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నా, కుట్రలకు తెర తీస్తున్నా ఆయన అణుమాత్రమైనా వెరవడం లేదంటే... కేవలం ప్రజలపై ఆయనకున్న నమ్మకం వల్లే! 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎంతగా కుమ్మక్కయినా... ‘ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తార’న్న జగన్ మాటలే అక్షరాలా నిజమయ్యాయి!

జగన్ వైపే.. జనం చూపు...
ఒకవైపు కరెంట్ లేక, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటివాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలన్న వైఎస్ సంకల్పాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజలంతా సమస్యల సుడిలో చిక్కి... వాటిని తీర్చే, తమకోసం నిలిచే నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు జగనేనని వారిప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని పలుమార్లు స్పష్టంగా రుజువైంది. రాజన్న స్వప్నించిన సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా ముందుకొచ్చిన జగన్ వైపే ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి కనబడుతున్న ఒకే ఒక్క నాయకుడు.. ఏకైక ప్రత్యామ్నాయం జగన్!!