Monday 3 June 2013

YS షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు మంగళవారం 13 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొవ్వూరు పట్టణానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సాయంత్రం కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

పర్యటించే ప్రాంతాలు :
కొవ్వూరు పట్టణంలోని మెరక వీధి, బస్టాండ్ సెంటర్, విజయ విహార్ సెంటర్, సీతారామరాజు చౌక్, ఆంధ్రా షుగర్స్, రోడ్డు కం రైలు బ్రిడ్జి, రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్, మెయిన్ రోడ్డు,apsara theater center

మీ పార్టీ పూర్తి పేరు మీకు తెలుసా బొత్సా?

రాష్ట్రంలో 2004 నుంచి చేపట్టిన సంక్షేమ పథకాలు అక్షరాలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డివేనని, అవెంత మాత్రం కాంగ్రెస్ పార్టీవి కానే కావని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వైఎస్‌వి కావని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భూమన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలు ఫీజుల చెల్లింపు పథకం వరకూ కాంగ్రెస్ పథకాలే అయితే 2004 ఎన్నికల సందర్భంగా కాని, 2009లోగాని జాతీయ స్థాయిలో ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టో(ప్రణాళిక)లో వీటిని ఎందుకు చేర్చలేదని కరుణాకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పోనీ.. కనీసం ఏ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలున్నాయేమో చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు.

పేదల కోసం వైఎస్ చేపట్టిన పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకే తమ పార్టీ జెండాలోనూ, ఎజెండాలోనూ వాటిని చేర్చామని ఆయన వివరించారు. పార్టీ పేరేమిటో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం తెలుపుతూ.. ‘‘మాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. లక్షలాది మంది శ్రామికులు, కోట్లాది మంది రైతులు, మరెంతో మంది యువజనుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఆ వర్గాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించే సమున్నతమైన పార్టీ అని మేం ధైర్యంగా చెప్పుకోగలం. ఏ పార్టీనైనా సంక్షిప్త నామంతో పిలుస్తారు, అలాగే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాం.. అందులోనే వైఎస్సార్ పేరు కూడా ఇమిడి ఉంది...’’ అని ఆయన పేర్కొన్నారు.

మీది భారత జాతీయ కాంగ్రెస్ అని తెలుసా?

పీసీసీ అధ్యక్షుడైన బొత్సకు.. కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు ‘భారత జాతీయ కాంగ్రెస్’(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అనే విషయం తెలుసా? ఆ పేరును ఎపుడైనా ఉచ్చరించారా? 1885 సంవత్సరంలో ఆ పార్టీని ఏర్పాటు చేసిందెవరో బొత్సకు తెలుసా? అని భూమన నిలదీశారు. అసలాయనకు అంత రాజకీయ పరిజ్ఞానం ఎక్కడిదని అన్నారు. వైఎస్ చేపట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని బొత్స అడగడం అర్థరహితమని ఆయన అన్నారు. ‘‘982 వ్యాధులకు చికిత్స చేయించేందుకు వీలుగా వైఎస్ రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కారుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? శాశ్వత దుర్భిక్షం నుంచి విముక్తి కోసం ఉద్దేశించిన జలయజ్ఞాన్ని నీరుగార్చింది మీరు కాదా? ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నది మీరు కాదా? ప్రజలకు 104, 108 పథకాలను అందుబాటులో లేకుండా చేస్తున్నది మీరు కాదా? అవి నిజంగా కాంగ్రెస్ పథకాలే అయితే మీరెందుకు అమలు చేయడం లేదు’’ అని ఆయన దుయ్యబట్టారు. కిలో రెండు రూపాయల బియ్యాన్ని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచుతామని, వ్యవసాయరంగానికిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని వైఎస్ ఇచ్చిన రెండు హామీలనూ నేటికీ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ నిష్కల్మషంగా బయటకొస్తారు

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటూ బొత్స చెప్పడం అసమంజసంగా ఉందని భూమన అన్నారు. ఏ తప్పూ చేయని, ఏనాడూ సచివాలయం వైపు కన్నెత్తికూడా చూడని జగన్‌పై అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించారని, సీబీఐ పెట్టిన ఈ తప్పుడు కేసులపైనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని భూమన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానవర్గాన్ని జగన్ ధిక్కరించారన్న దుగ్దతోనే సీబీఐని ఉసిగొల్పి వేధిస్తున్నారని, నూటికి నూరు శాతం ఆయన నిష్కల్మషంగా బయటకు వస్తారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన తమ పార్టీపైనా, జగన్‌పైనా తెల్లారి లేచిన దగ్గరి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

టీడీపీ నేతలారా.. నియమావళి చదవండి..

జగన్ ములాఖత్‌లపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ నూరుశాతం అబద్ధాలేనని, యనమల రామకృష్ణుడు జైలు నియమావళిని చదవకుండా రాద్ధాంతం చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు జైలు అధికారులనే బెదిరించే విధంగా ఉందన్నారు. నిర్బంధంలో ఉన్న ఖైదీలా కాకుండా శిక్ష పడిన ఖైదీ మాదిరిగా వారానికి రెండుసార్లు మాత్రమే జైలు అధికారులు జగన్ ములాఖత్‌లకు అవకాశం కల్పిస్తున్నారని, ఇది చాలా అన్యాయమని, దీనిపై తాము తీవ్ర నిరసన తెలుపుతున్నామని భూమన అన్నారు.

జగన్‌కు వారానికి రెండుసార్లు మాత్రమే నలుగురేసి వ్యక్తులను కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని, ఇది చాలా దారుణమని, ఆయనకు నిబంధనల ప్రకారం కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇక్కడి నుంచి జగన్‌ను తరలించాలని కూడా కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారని భూమన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

కిరణ్ కుట్రలో భాగమే ఇలాంటి కథనాలు
కృష్ణా పత్రిక వార్తలపై భూమన ఆగ్రహం
మాది నికార్సయిన లౌకిక పార్టీ

వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సయోధ్యకు మంతనాలు జరుగుతున్నాయని కృష్ణా పత్రిక ప్రచురించిన వార్తా కథనం వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమది నికార్సయిన, నిక్కచ్చి అయిన లౌకిక పార్టీ అని, అందువల్ల ఇలాంటి పత్రికలు రాసే గాలి, నీలి వార్తలను పట్టించుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘పట్టుమని పది మంది కూడా డబ్బిచ్చి కొన ని, ఉచితంగా పంచి పెడుతున్న, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బినామీల చేత నడిపించే ఓ పత్రికలో కుట్రపూరితంగా రాయించుకునే కథనాలను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని దెబ్బతీయడం కోసం కిరణ్ పన్నుతున్న కుట్రల్లో భాగంగానే ఇలాంటి కథనాలు రాయిస్తున్నారన్నారు. ఇలాంటి వార్తా కథనాలనే కొన్ని చానళ్లు పనిగట్టుకుని చూపిస్తున్నాయని, లక్షలాది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొన్న సాక్షి పత్రికను చూపించకుండా.. ఉచితంగా పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి బినామీ పత్రికను చానళ్లు తమ చర్చల్లో చూపిస్తున్నాయని, దాన్ని బట్టే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని తెలుస్తోందని ఆయన అన్నా 

టి.ని వ్యతిరేకించి పార్టీలతో కలవబోమంటే..

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాద్ సింగ్ చేసిన ఒక ప్రకటన ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి బిజెపిలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ను వ్యతిరేకించే పార్టీలతో కలవబోమని ఆయన అన్నారు. అంటే రాష్ట్రంలో పార్టీలా?లేక జాతీయ స్థాయిలోని పార్టీలతోనే అన్నది స్పష్టత లేదు.రాష్ట్రంలో బిజెపితో కలవడానికి ఏ పార్టీ సిద్దంగా లేదు. తెలంగాణ సాధన కోసమే పుట్టిన టిఆర్ఎస్ కూడా బిజెపిని అంటరాని పార్టీగానే ప్రస్తుతం ఎన్నికల నేపధ్యంలో చూస్తోంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో పొత్తు లేదని అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మొదటి నుంచి అదే పంధాలో ఉంది.ఇక జాతీయ స్థాయిలో కూడా అదే వైఖరి తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశం.శివసేన తెలంగాణ ఏర్పాటుకు అంత అనుకూలం కాదు. మహారాష్ట్రలో విదర్భ రాష్ట్ర ఏర్పాటును వారు వ్యతిరేకిస్తున్నారు.మరి అలాంటప్పుడు శివసేనతో కలవకుండా ఉండగలరా అన్నది ప్రశ్నార్ధకం.కాగా కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని, లేకుంటే బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని రాజ్ నాద్ సింగ్ చెబుతున్నారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా రాజ్ నాద్ సింగ్ గట్టి ప్రకటనలే చేస్తున్నారు.

జగ్గారెడ్డి ఆ విషయం ఒప్పుకున్నట్లే కదా!

మొత్తం మీద విప్ జగ్గారెడ్డి ఒక మాట ఒప్పుకున్నారు.కెసిఆర్ పై విమర్శలు చేస్తూనే ప్రజలు ఆయన మాటలను నమ్ముతున్నారన్న అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పారు.కెసిఆర్ మాయ మాటలు చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు.అందులో ఆయన సఫలం అవుతున్నారని కూడా జగ్గారెడ్డి అనడం విశేషం. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)విమర్శించారు. అందులో అతను సక్సెస్ కూడా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎల్ పి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ ఇష్టానుసారం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం
కెసిఆర్ కు తగదన్నారు.తెలంగాణ అబివృద్దికి ఆయా ముఖ్యమంత్రులు ఎంతో కృషి చేశారని,కిరణ్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఆయన చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిన తీరుపై ఈయన మాట్లాడుతూనే జనంలో పట్టు ఉన్న విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నట్లే కదా!

నిజాయితీపరులు టిడిపిలో ఎలా ఉంటారు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చిరంజీవి బహిరంగంగా అమ్ముడుపోతే, చంద్రబాబు తెరవెనుక అమ్ముడుపోయారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే...ఆ పార్టీ నుంచి నీతిపరులైనవారు వలసబాట పడుతున్నారని ఆమె సూత్రీకరించారు. చంద్రబాబు తన హయాంలో రుణమాఫీ ఎందుకు చేయలేదని షర్మిల అడుగుతున్నారు.
ప్రతి ఎన్నికలోనూ, అవిశ్వాస సమయంలోనూ కాంగ్రెస్‌తో బాబు జతకట్టారని ఆమె అన్నారు. చంద్రబాబు తీరుతో నిజాయతీపరులైన నాయకులు టీడీపీలో ఎలా ఉంటారని కూడా ఆమె అనడం విశేషం.షర్మిల ప్రశ్న ద్వారా ఎదురుదాడి చేస్తున్నారన్నమాట.

కెసిఆర్ కు కొత్త చికాకు!

రాజకీయాలలో కావాలని జరగకపోయినా, అది ఒక్కోసారి ఇబ్బంది సృష్టిస్తుంది.తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్తగా చేరిన కాంగ్రెస్ ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లకు నిజాం కాలేజీ మైదానంలో జరిగిన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. వర్షం తదితర కారణాలు ఎలా ఉన్నా వారిద్దిరికి కొద్ది సేపైనా అవకాశం ఇచ్చి ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండేది కాదు. అప్పుడు కారణం ఏమైనా వారు మాట్లాడకపోవడంతో ప్రత్యర్ధి పార్టీలు ఆ పాయింటు మీద కెసిఆర్ పై విమర్శలకు దిగుతున్నాయి.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్న కెసిఆర్ కనీసం సభలో వారిని మాట్లాడనివ్వలేదని ఎద్దేవ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు,ప్రభాకర్ లు కెసిఆర్ పై విమర్శలు చేస్తూ ఓట్లు,నోట్లు,సీట్లు తప్ప కెసిఆర్ కే వేరే పని లేదని కూడా ధ్వజమెత్తారు. దళిత ఎమ్.పిలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు. కొంతకాలం పాటు కెసిఆర్ కు ఇది చికాకుగా ఉండే అవకాశం ఉంది.వసూళ్లలో కెసిఆర్ బిజిగా ఉంటున్నారని వారు ఆరోపించారు.