Monday 29 April 2013

సీబీఐ చెప్పిందా.. అధిష్టానం చెప్పిందా?


జగన్ కేసులో కోట్ల వ్యాఖ్యలపై ఎంపీ సబ్బం హరి మండిపాటు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు నుంచి వదలబోమని సీబీఐ చెప్పిందా... లేక వదలొద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందా అని ఎంపీ సబ్బంహరి ప్రశ్నించారు. ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్తూ విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మండిపడ్డారు. స్వతంత్య్ర ప్రతిపత్తిగల సంస్థగా వ్యవహరించాల్సిన సీబీఐ కాంగ్రెస్ చెప్పుచేతల్లో ఉందని చెప్పడానికి కోట్ల వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నారు. జగన్ విషయంలో ప్రజలు ఏదైతే అనుమానిస్తున్నారో సూర్యప్రకాష్‌రెడ్డి మాటల ద్వారా అదే వ్యక్తమయిందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రపై ఆయన స్పందిస్తూ.. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు నాడు వైఎస్సార్ సూర్యోదయం నుంచి మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను పొద్దుపోయేవరకూ సాగించి ప్రజల విశ్వాసాన్ని పొందారని గుర్తుచేశారు. నేడు చంద్రబాబు పాదయాత్ర ఎలా చేశారో జనం చూశారన్నారు. 2014 ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోడానికే బాబు శుష్క వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ ఫలాలను అందుకోడానికి జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతో జనం ఉన్నారన్నారు.

విచారణకు రాకముందే వాయిదా ఎలా: సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సిబిఐ తన ధోరణి మాత్రం మార్చలేదు. నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లు ఇవ్వాళ కోర్టు ముందుకు రానున్నాయి. కోర్టు ఇచ్చిన నెంబరింగ్‌ ప్రకారం ఏడో సీరియల్‌ నెంబర్‌లో ఈ రెండు పిటీషన్లు విచారణకు రానున్నాయి. అయితే ఈలోగానే సిబిఐ తరపు న్యాయవాది ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ముందు మెన్షనింగ్‌ మ్యాటర్‌ ఉంచారు.
అత్యవసర సమయంలో చేయాల్సిన వాదనను మెన్షనింగ్‌ మ్యాటర్‌ అంటారు. నిమ్మగడ్డ, విజయసాయిలకు సంబంధించిన పిటిషన్లను మే 7కు వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బొగ్గు కుంభకోణంకు సంబంధించిన వ్యవహారంలో తలమునకలయి ఉన్నామని, పని ఒత్తిడి వల్ల ఈ కేసును మే 7కు వాయిదా వేయాలని సిబిఐ కోరింది. విచారణకు రాకముందే కేసును ఎలా వాయిదా వేయమంటారని ప్రశ్నించిన కోర్టు పిటిషన్‌ బెంచ్‌పైకి వచ్చినప్పుడు పరిశీలిస్తామని తెలిపింది.

సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యోగ సంఘాలు మంగళవారం సోనియాగాంధీ నివాసం ముట్టడికి యత్నించారు. సోనియా నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన టీ జాక్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే సోనియాకు వినతిపత్రం ఇచ్చేందుకు మాత్రం అనుమతించారు. పోలీసుల అనుమతితో టీ జాక్ నేత శ్రీనివాస్ గౌడ్ వినతపత్రం సమర్పించి వెనుదిరిగారు. మరోవైపు ఏఐసీసీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముట్టడించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

సోనియాగాంధీ నివాసం వద్ద భద్రత పెంపు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం వద్ద మంగళవారం భద్రతను పెంచారు. దీంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణవాదులు సోనియా నివాసాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో... ముందస్తుగా భద్రతను పెంచారు. 

తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: అద్వానీ

హైదరాబాద్: ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లమని.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డు పడకుంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలతో సుమారు గంట సేపు మాట్లాడారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో సంసద్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ సంకల్పం కావాలని అద్వానీ వారితో పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ, విదర్భ రాష్ట్రాలు ఏర్పాటు కావాల్సిందని... తెలంగాణకు చంద్రబాబు, విదర్భకు శివసేన అడ్డు పడ్డాయని వివరించారు. ములాయం, లాలూ లాంటి వాళ్లు నిరాకరించినా, మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే గెలుస్తుందని, తప్పనిసరిగా తెలంగాణ ఇస్తుందని అద్వానీ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఈసారి తమ ఎన్నికల ఎజెండాలో పెట్టనున్నట్లు చెప్పారు. అయితే.. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అద్వానీ చెప్పినట్టు పార్టీ నాయకులు రామచంద్రరావు, మల్లారెడ్డి తెలిపారు. 

Abhimanyuda...! Arjunuda...! YS Jagan Song


YS Jagan's bail plea hearing adjourned to May 6

మే 1 నుంచి యధావిధిగా షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మే 1వ తేదీ నుంచి యధావిధిగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాదయాత్రికురాలు, పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ఎడమకాలి మడమ నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా మంగళవారం మరో ప్రజాప్రస్థానానికి విరామం ప్రకటించారు. శ్రీమతి షర్మిలకు మంగళవారం కూడా విశ్రాంతి అవసరమని వైద్యులుసూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తల‌శిల రఘురాం చెప్పారు.

చంద్రబాబువి శుష్క వాగ్దానాలు: గట్టు రామచంద్రరావు


హైదరాబాద్ : శుష్క వాగ్దానాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ కోసం వస్తున్న పాదయాత్రలో బాబు చాలానే శుష్క వాగ్దానాలు చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎన్ని వాగ్దానాలు అమలు చేశారని గట్టు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాల కోసం పోరాడారన్నారు.

ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు అలవాటేనని, మరోసారి ప్రజలను మోసం చేయడానికే ఈ వాగ్దానాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉండగా బాబు కోటి వరాలు అంటూ కోటి మోసాలు చేసింది నిజంకాదా అని ప్రశ్నలు సంధించారు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కిలో రెండు రూపాయాల బియ్యం ధరను పెంచారని, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది కూడా ఆయనేనని అన్నారు. బాబు వాగ్దానాలను ఏ ఒక్కరూ నమ్మరని గట్టు పేర్కొన్నారు.

YS జగన్‌ బెయిల్‌పై సిబిఐకి సుప్రీం నోటీసులు


న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మే 6 లోపు నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. రాజకీయ దురుద్దేశంతోనే బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంటోందని జగన్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే ... జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌తో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. 

సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన హామీని సీబీఐ నిలబెట్టుకోలేదని హరీష్‌ సాల్వే అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అక్టోబర్‌ 5 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని న్యాయమూర్తులకు వివరించారు. ఆ ఉత్తర్వు కాపీని న్యాయమూర్తులు పరిశీలించారు. హరీష్‌ సాల్వే వాదనలు విన్న సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మే 6న జరగనుంది.