Thursday 30 May 2013

ప్రార్ధనల కోసం జెరుసలెమ్ కు జోగి రమేష్

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ జెరుసలెమ్ వెళుతున్నారు.ఆయన ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ను ఉల్లంఘించి మరీ జగన్ కు మద్దతు ప్రకటించారు.ఇప్పుడు ఆయన జెరుసలెమ్ కు వెళుతున్న కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ ను బెయిల్ రావాలని,వై.ఎస్.కుటుంబానికి మేలు జరగాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయడానికి తాను జెరుసలెమ్ వెళుతున్నట్లు ఆయన చెబుతున్నారు.గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఒకసారి జెరుసలెమ్ వెళ్లి వస్తుండేవారు.

కేసీఆర్‌పై కేసు నమోదుకు ఖమ్మం కోర్టు ఆదేశం

ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై కేసు నమోదు చేసి జూన్ 28న కోర్టుకు దర్యాప్తు నివేదిక పంపాలని ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ గురువారం ఖమ్మం పోలీసులను ఆదేశించారు. ఈ ఫిర్యాదును ఖమ్మం న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి రామారావు కోర్టులో దాఖలు చేశారు. కేసు వివరాలివీ... 2013 జనవరి 28న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద జరిగిన సమరదీక్షను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగంలో దేశ ప్రధానమంత్రిని అగౌరవ పరుస్తూ ప్రసంగించారని రామారావు తన ఫిర్యాదులో వివరించారు. కేసీఆర్‌మాటలు దేశ ప్రజల ఆత్మగౌరవం, విశ్వాసాలను దెబ్బ తీశాయన్నారు. కాగా, కేసు నమోదు, దర్యాప్తు నిమిత్తం మెజిస్ట్రేట్ ఆదేశించగానే కొందరు న్యాయవాదులు గొల్లపూడి రామారావును దుర్భాషలాడటంతో పాటు ఆయనపై భౌతికదాడికి యత్నించారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఈఫిర్యాదు వెనుక టీడీపీ హస్తం ఉందని అర్థమవుతోందని న్యాయవాదుల జేఏసీ జిల్లా కన్వీనర్ తిరుమలరావు తెలిపారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబువన్నీ అసత్యాలే:జైళ్లశాఖ డీజీ

హైదరాబాద్: జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారంటూ, నీలి చిత్రాలు చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు స్పష్టం చేశారు. చంద్రబాబువి పూర్తి నిరాధార ఆరోపణలని పేర్కొన్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. జైళ్ల గురించి అవగాహనా రాహిత్యంగా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పలు వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జైళ్ల శాఖపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. 

దీనిపై జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి సారాంశం.. ‘‘జైళ్ల స్థితిగతులపై.. ముఖ్యంగా చంచల్‌గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని, జైళ్లలో ఖైదీలు మద్యం తాగుతూ, నీలి చిత్రాలు చూస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోపణలను పలు దినపత్రికల్లో కూడా ప్రచురించారు. ఈ విషయమై ఆయనకు తెలియజేయునది ఏమనగా... చంచల్‌గూడ జైల్లో స్పెషల్ క్లాస్ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తున్నాము. జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలూ కల్పించడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా తెలుగుదేశం పార్టీ వారు కోరిన ప్రతిసారీ సంబంధిత వివరాలను పారదర్శకంగా అందించాము. జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారని, నీలి చిత్రాలు చూస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తి అసత్యాలు. అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయం. భారత జైళ్ల వ్యవస్థలో మన్నికైన, ప్రతిభావంతమైనదిగా రాష్ర్ట జైళ్ల శాఖకు పేరుంది. అలాంటి జైళ్ల శాఖపై తీవ్ర ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనలు- 1979 మేరకు మానవ హక్కుల పరిరక్షణ కల్పనతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఈ శాఖను నిర్వహిస్తున్నాము. జైళ్ల శాఖపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వివరిస్తున్నాము’’

వరంగల్ ఎమ్.పి దారెటు

వరంగల్ కాంగ్రెస్ ఎమ్.పి సిరిసిల్ల రాజయ్య దారి ఎటు అన్నది చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల రెండో తేదీలోగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన కూడా చేరవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తుండగా,భారతీయ జనతా పార్టీ కూడా ఆయనపై కన్నేసింది.తమ పార్టీలో చేరవలసిందిగా ఆ పార్టీ నాయకత్వం కోరగా చూద్దాం అని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. వరంగల్ స్థానాన్ని కడియం శ్రీహరికి ఇవ్వవలసి ఉన్నందున మానకొండూరు అసెంబ్లీని రాజయ్యకు టిఆర్ఎస్ ఆఫర్ చేసిందని అంటున్నారు.దానికి రాజయ్య అసంతృప్తి చెందారు.ఈ నేపధ్యంలో రాజయ్య బిజెపి ఆఫర్ ను స్వీకరిస్తారా?టిఆర్ఎస్ లోకి వెళతారా?కాంగ్రెస్ లోనే ఉంటారా అన్నది తేలవలసి ఉంది.

కాంగ్రెస్ టి.ఇవ్వదూ..కాని ఎలా వస్తుంది!

తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత కె.కేశవరావు,ఎమ్.పిలు మందా జగన్నాధం,వివేక్ లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ప్రకటించారు.అందువల్లనే తాము కాంగ్రెస్ ను వీడుతున్నామని చెప్పారు.ఇంతవరకు బాగానే ఉంది.తాము ఉద్యమానికి ప్రతిరూపంగా ఉన్న టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.అయితే ఇంతవరకు ఒకేగాని, కొందరు ఇతర పక్షాల నేతలు అడుగుతున్నట్లుగా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణ ఎలా వస్తుందన్నదానికి కేశవరావు వంటి నేతలు సమాధానం సమర్ధంగా చెప్పగలిగితే బాగుంటుంది.ఎందుకంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను కాదని అంటున్నారు. ఒకే.అదే సమయంలో తాము బిజెపితో పొత్తు పెట్టుకోబోమని టిఆర్ఎస్ ప్రకటించింది. అలాంటప్పుడు బిజెపితో కూడా వీరు కలవబోరు.ఈ రెండు పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ ఎలా వస్తుందన్నదానిపై కేశవరావు బహుశా భవిష్యత్తులో వివరణ ఇస్తే బాగుంటుంది.

రాజ్యసభకు ఐదోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నిక

గువాహటి: ప్రధాని మన్మోహన్ సింగ్ వరుసగా ఐదోసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొత్తం 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో ఆయనకు 49 తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. అస్సాం నుంచి పోటీ చేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి శాంటియస్ కుజుర్‌కు 45 ఓట్లు లభించాయి. ఆలిండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) తరఫున పోటీచేసిన అమీనుల్ ఇస్లాంకు 18 ఓట్లు మాత్రమే దక్కడంతో ఓడిపోయారు. ఫలితాల వివరాలను అస్సాం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి జి.పి.దాస్ వెల్లడించారు. తొలి ప్రాధాన్యత ఓట్లు గల స్థానానికి ప్రధాని మన్మోహన్ మాత్రమే పోటీ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కాగా, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న అస్సాం గణ పరిషత్, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగుకు దూరంగా ఉండిపోయాయి. 

ఈ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన 78 మంది ఎమ్మెల్యేలు, భాగస్వామ్య పార్టీ అయిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఐదోసారి తనను రాజ్యసభకు ఎన్నుకున్న సందర్భంగా ప్రధాని మన్మోహన్ అస్సాం ప్రజలకు, ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సహా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అస్సాం అభివృద్ధి కోసం తన కృషిని కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

నాకు వేరే మార్గం లేదు: జానారెడ్డి

హైదరాబాద్: ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌తో పాటు సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్‌ను వీడి వెళ్లటం కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. ఎంత ప్రభావం ఉంటుందనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందని, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ వీడి వెళ్తున్న ఎంపీలతో పాటు మిగతా వారిని కూడా పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. తనకు వేరే మార్గం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటానని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతానని పేర్కొన్నారు. సహచర నాయకులు పార్టీ వీడి వెళ్లినప్పటికీ.. తమ మధ్య దూరం పెరగదన్నారు. ఉదయం కేకే తనతో సమావేశమైన సందర్భంగా తాను ఏం చెప్పాననేది వెల్లడించనని.. అది ఆయననే అడగాలని చెప్పారు. తాను హోంమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరగటం తనకే సిగ్గుచేటుగా ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవే కావాలని అడగలేదని, ఎన్నడూ ఫలానా శాఖ మంత్రి పదవి ఇమ్మని అడగలేదని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసి పంచాయతీ ఎన్నికలపై చర్చించానని, శాఖల గురించి కాదన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండు లేదా మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని, వారంలోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపిస్తామని జానారెడ్డి తెలిపారు. జూలై తొలి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయన్నారు. 

సిబిఐ జెడి లక్ష్మీనారాయణ బదిలీ

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జూన్ ఏడో తేదీన తిరిగి తన సొంత క్యాడర్ అయిన మహారాష్ట్ర సర్వీస్ కు వెళ్లిపోతున్నారు.ఆయన ముంబై క్రైం బ్రాంచ్ అధినేతగా నియమితులైనట్లు సమాచారం.గాలి జనార్ధనరెడ్డి కేసులో సంచలన అధికారిగా నమోదైన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జగన్ కేసులో కొంత వివాదాస్పదుడయ్యారు.ఈ కేసు రాజకీయ కేసుగా మారిపోవడంతో కొన్ని పొగడ్తలు,కొన్ని విమర్శలు స్వీకరించవలసి వచ్చింది.

మర్రి జనార్ధనరెడ్డి దారి టిఆర్ఎస్సే!

నాగర్ కర్నూల్ నుంచి కిందటిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జెసి బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధనరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నారు.ఆయన బిజెపిలో చేరతారేమోనని ప్రచారం జరిగింది. కాని కేశవరావు, మందా జగన్నాధం,వివేక్ తదితరులతో పాటు ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.కాగా తాము ఎలాంటి పదవులు ఆశించడం లేదని కేశవరావు చెప్పారు.అయితే ఆయన కుమారుడు విప్లవ్ కుమార్,మందా జగన్నాధం కుమారుడు శ్రీనాధ్ కూడా కేశవరావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.కాగా టిడిపి మాజీ ఎమ్.పి మాణిక్ రెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరుతుండడం విశేఫం.అలాగే భువనగిరి లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్న నరసయ్య గౌడ్ కూడా టిఆర్ఎస్ లో ప్రవేశిస్తున్నారని కధనం.కాగా ఇదే సీటుపై దృష్టి పెట్టుకున్న టిఆర్ఎస్ నేత శ్రావణ్ భవిష్యత్తు ఏమిటో తెలియాల్సి ఉంది.