Friday 31 May 2013

బాబు మానసికస్థితిపై జూపూడి ప్రభాకర రావు అనుమానాలు

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మానసిక పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గానీ, మిత్రుల గానీ ఆయనను విదేశాలకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించడం మంచిదని సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖైదీలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జైళ్లలో అభ్యంతరకర సౌకర్యాలు అందజేస్తున్నారని చంద్రబాబు చేసిన నిరాధారమైన ఆరోపణలపై జైళ్ల శాఖ డిజి కృష్ణంరాజు స్పందించారని తెలిపారు. టీడీపీ నేతలకు చెంపపెట్టులా కృష్ణరాజు వివరణ ఇచ్చారని చెప్పారు. ఆయన వివరణకు టీడీపీ నేతలు ఇంతవరకూ ఎందుకు స్పందిచలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ములాఖత్ లపై గతంలో వైఎస్ భారతి విసిరిన ఛాలెంజ్ కు ఇప్పటి వరకూ స్పందన లేదన్నారు. చంద్రబాబు తన అలవాట్లను ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పై టిడిపి నేతలు అనుచిత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా జూపూడి హెచ్చరించారు. 

టీఆర్‌ఎస్, జేఏసీకి టిడిపి ఆఫర్

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టిడిపి నేత పెద్దిరెడ్డి ఆఫర్ ప్రకటించారు. కావాలంటే షరతులు పెట్టి తమను కలుపుకోవచ్చని కూడా చెప్పారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు (కెసిఆర్) నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా ఆయన విగ్రహాలు పెడతామని చెప్పారు. ఆయన ఫొటోలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతామన్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేవారంతా పదవులకోసమేనని విమర్శించారు. ఉద్యమాన్ని పక్కనపెట్టి ఓట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2014 తర్వాత ఆ పార్టీలో వలసవెళ్లినవారు తప్ప ఉద్యమకారులుండరన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఎసి గొడుగు కింద కెసిఆర్ స్వతంత్ర ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపు ఇచ్చారు.

తిరుపతి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి అనుమతి

హైదరాబాద్: ఆడిటర్ విజయసాయిరెడ్డి తిరుపతి వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి వెళ్లేందుకు జూన్ 1 నుంచి 3 వరకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 

'YSజగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు'

న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్‌ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్‌ గుజ్రాల్‌ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. 

తమను కాదని జగన్‌ కొత్త పార్టీ పెట్టుకున్నందుకే జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొల్పిందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. 

'YSజగన్ పై విమర్శలు చేస్తూ పైశాచికానందం'

కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని సంయమనంతో మాట్లాడాలని సలహా ఇచ్చారు. 

'తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తా':

కరీంనగర్ : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుంటానని ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తనతో మాట్లాడారని ఆయన తెలిపారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వారు సూచించారని వివేక్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిసి స్పష్టత ఇస్తామని ఆయన తెలిపారు. ఎంపీ రాజయ్యతో సహా అందరం టీఆర్ఎస్ లో చేరతామని మందా జగన్నాథం తెలిపారు.

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీమంత్రి మోపిదేవి

హైదరాబాద్ :వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

సిఎం,చంద్రబాబులపై విరుచుకుపడ్డ కేటీఆర్

అధిష్టానానికి డెడ్‌లైన్లు విధించవద్దన్న సిఎం వ్యాఖ్యలపై కేసీఆర్ కుమారుడు ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకు పడ్డారు. ప్రజాదరణ లేని, ప్రజామోదం లేని సిఎంగా కిరణ్ ఉండటం తెలుగు ప్రజలు, తెలంగాణవాళ్లు చేసుకున్న పాపమని కేటీఆర్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంకెంతకాలం తీర్చకుండా ఉంటారని ప్రశ్నించారు. కావూరి అలకబూనితే వెంటనే రాజీకి వెళ్లిన సిఎం కిరణ్, తెలంగాణ ఎంపీలు డెడ్‌లైన్ పెట్టినా కనీసం స్పందన లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సిఎం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలకు ఓ న్యాయం..ఆంధ్రా ఎంపీలకు ఓ న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును కూడా కేటీఆర్ వదిలిపెట్టలేదు..లోకేష్ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కన పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. 

సిఎంపై యనమల విమర్శలు

అహ్లూవాలియా రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించడం వెనుక కిరణ్ తప్పుడు సమాచారం ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం అవినీతిలో కొట్టిమిట్టాడుతుంటే అభివృద్ధి పథంలో నడుస్తుందనడం హాస్యాస్పదమని యనమల అన్నారు. బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పథకాలకు కోత విధించి, కొత్త పథకాలు పెడతారా లేక ప్రజలపై మరోసారి పన్నుల భారం విధిస్తారా సిఎం స్పష్టం చేయాలని కోరారు. అహ్లూవాలియా మాటవరుసకు అన్న మాటలను ఏదో ప్రశంసించినట్లు సిఎం పేర్కోవడం గర్హనీయమని యనమల వ్యాఖ్యానించారు.