Tuesday 4 June 2013

Special edition on Godavari Sakshigaa..

ఆ చేతి స్పర్శ కొండంత ధైర్యం... నిండైన భరోసా...

జగనన్న!
ఆ పేరు తలచుకుంటే సామాన్యుడి ఛాతీ సముద్రమంత అవుతుంది
ఆ రూపం గుర్తొస్తే చెయ్యి సగర్వంగా మీసం మీదకు చేరుతుంది
నిద్రలో, మెలకువలో శత్రువులు సైతం జపిస్తున్న పేరది
తడి నిండిన కళ్లతో రాష్ట్రమే తపిస్తున్న పేరది
గడిచిన చరిత్ర కాదు - నడుస్తున్న వర్తమానం తను
రాజకీయశక్తి కాదు... ఈ రాష్ట్ర భవిష్యత్తు తను..!

చెక్కిలి తాకే ఆ చేతి స్పర్శ నేనెప్పుడూ అనుభవించలేదు
కానీ దాని చల్లదనం నాకు తెలుసు
కొండంత ధైర్యాన్ని కరపత్రంలా పంచే
ఆ ఆలింగనాన్ని నేనెప్పుడూ అందుకోలేదు
కానీ ఆకాశమంత ఆ ఓదార్పు నాకు తెలుసు
నిద్రలేని రాత్రులు - అలుపెరుగని యాత్రలు
తలవంచని దీక్షలు - అన్నీ నాకు తెలుసు!

నిలువెత్తు ఆత్మస్థైర్యం తను
చిరునవ్వు చెరగని సంకల్పం తను
రాజభోగాల్ని కాదనుకుని రాళ్లబాటలో సాగుతున్న
సాహస యాత్రికుడతను
ఆడి తప్పని పాపానికి నిర్బంధపు శిలువ మోస్తున్న
చారిత్రక సాక్ష్యమతను!

నిజానికి!
నేనెవరో తనకి తెలీదు
తెలియాల్సినంత, తెలుసుకోవాల్సినంత విషయాన్ని కూడా కాదు నేను
కానీ... తన పోరాటం నా కోసం
నా గుప్పెడు మెతుకుల కోసం- నా గూడు నిలబడటం కోసం
నా బిడ్డల ఫీజు కోసం - పండుటాకుల పింఛను కోసం
నా ఆసరా కోసం - నా ఆరోగ్యసిరి కోసం
నా అన్నల కోసం - అక్కల కోసం
అవ్వల కోసం - తాతల కోసం
నాలాంటి సామాన్యుల స్వప్నం కోసం
తల తెగినా తలవంచని నా జాతి ఆత్మగౌరవం కోసం..!
అందుకే నిర్బంధాల కొలిమి వేయి నాలుకలు చాస్తోంది
అబద్ధాలతో అగ్నిపుత్రుణ్ని అణచివేయాలని చూస్తోంది
జగమంత జననేతని జనానికి దూరం చేయాలనే
ఢిల్లీ కుట్రకు దర్యాప్తు సంస్థల్ని ధారాదత్తం చేస్తోంది!

కానీ నడుస్తున్న కాలానికి, కదులుతున్న కెరటాలకి తెలుసు
సునామీని దాచుకున్న జనసంద్రం సమయం కోసం చూస్తోందని
జగన్నాథ రథచక్రం మళ్లీ జనం కొరకు వస్తుందని..!

చంచల్‌గూడ ఇప్పుడు జైలు కాదు
జగనన్నని మోస్తున్న జనగర్భం
పుటం పెట్టిన బంగారంలా ప్రజానేత బయటికొస్తాడు
‘కాష్టం’ మళ్లీ రాష్ట్రమవుతుంది!

హెరిటేజ్ పాలలో ఈగ

‘బ్రింగ్ హోమ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్’ అనే స్లోగన్‌తో ప్రచారం చేసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో క్రిమి కీటకాలు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఒక వినియోగదారుడు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో ఈగ దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. గతంలో కూడా అనేకసార్లు హెరిటేజ్ పాలలో క్రిమికీటకాలు దర్శనమిచ్చిన విషయం విదితమే. పాల శుద్ధి, ప్యాకింగ్‌లో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. 
- న్యూస్‌లైన్, భీమవరం 

ఈ వర్షంతో నాన్నే ఆశీర్వదించినట్లుంది

అది గోదారమ్మ పశ్చిమ తీరం.. మంగళవారం సాయంత్రం 4.40 అవుతోంది.. ఒక వైపు గోదారమ్మ హొయలు... మరోవైపు సూర్యుని సెగలు.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రేవువైపు షర్మిల నడుస్తున్నారు. మరోవైపు ఆమె వెంట తరలివస్తున్న జన నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంతలో పొద్దంతాసెగలు చిమ్మిన సూర్యుడు మబ్బుల్లోకి పోయాడు. షర్మిల నదిలోకి వెళ్లి తల్లి గోదారికి దండం పెట్టారు. పసుపు, కుంకుమ, గాజులు గోదారమ్మకు సమర్పించారు. తలో ఆకాశంలో ఏదో మార్పు.. చూస్తుండగానే మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కొక్క చినుకూ రాలుతోంది. షర్మిల కొవ్వూరు బ్రిడ్జి మీదకు చేరారు. అంతే.. జోరున వర్షం కురిసింది. వర్షంలో తడిసి ముద్దవుతూనే షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 
అది 2003లో వైఎస్సార్ నడిచిన బ్రిడ్జి, 2011లో జగన్‌మోహన్‌రెడ్డి హరితయాత్ర సాగిన బ్రిడ్జి.. ఆ జ్ఞాపకాలు మదిని తొలిచాయో ఏమో.. ఎప్పుడూ వేగంగా పడే ఆమె అడుగులు భారంగా పడ్డాయి. 

ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొంటూ, చెదరని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు షర్మిల! తర్వాత రాజమండ్రిలో జరిగిన సభలో కొవ్వూరు బ్రిడ్జితో తమ కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘నాడు ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో నాన్న గోదావరి వంతెన మీదుగా అడుగులు వేసుకుంటూ ఇదే తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ అనే ఈ పాదయాత్రలో ఈ రోజు నేను కూడా అదే వంతెన మీద ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తుంటే మనసు నిండా నాన్న గారి జ్ఞాపకాలతో గుండె బరువెక్కింది. 
ఆ రోజు నాన్న వంతెన మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఈ రోజు మేం అడుగు పెట్టగానే వర్షం బోరున కురిసి, స్వయంగా నాన్నే మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది. ఆ రోజు నాన్నకు మద్దతుగా అశేష జనవాహిని వంతెన మీద ఆయనతో నడిచినందుకు గోదావరే సాక్షిగా నిలిచింది. ఆ తరువాత రెండేళ్ల క్రితం జగనన్న పోలవరం సాధన కోసం ఇదే వంతెన మీద నడుచుకుంటూ వచ్చారు. ఆ రోజు జగనన్నకు, ఈ రోజు మాకు అదే జనవాహిని వచ్చి రాజన్న బిడ్డలకు తోడుగా, అండగా నిలబడ్డామని చెప్తుంటే మళ్లీ గోదావరే సాక్షిగా నిలబడింది’’ అని అన్నారు.

జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?

టీడీపీని కబ్జా చేసి.. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి.. ఒక్క లోకేశ్‌నే పైకి తేవాలనుకోవడం లోక కల్యాణం కాదు.. 
లోకాన్ని దోచుకుని మీరు సంపాదించుకున్న ఆస్తులేమో లోకేశ్‌కు ఇస్తారు.. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
జెండా పట్టుకున్న కార్యకర్తలేమో ఆస్తులు అమ్ముకోవాలా?
చంద్రబాబూ.. మీకు పదవీ వ్యామోహం లేదంటే మీ పార్టీ వారే నమ్మరు
ఇప్పుడు వెలుగులు నింపుతానంటున్నారు.. మరి అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఏంచేశారు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 169, కిలోమీటర్లు: 2,235.8 
ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. తాను లోక కల్యాణం కోసం పాటు పడుతున్నానని చెప్తున్నారు. తనకు స్వార్థం లేదని, ప్రజాసేవే ముఖ్యమని, రాష్ట్రంలో వెలుగులు నింపుతానని, ధర్మ పోరాటం చేస్తున్నానని, తాను అవినీతి మీద పోరాటం చేస్తున్నానని.. ఇలా చంద్రబాబు డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబుగారికి లోక కల్యాణం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లోక కల్యాణం అంటే లోకంలోని ప్రజలకు మేలు చేయడం. ఒక్క ఆయన కుమారుడు లోకేశ్‌కు మేలు చేయాలనుకుంటే అది లోక కల్యాణం కాదు. 

మన రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిలబడటానికి 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మాత్రమే, అది కూడా అసమ్మతి ఎమ్మెల్యేలను కూడా కలుపుకొంటే. మరి మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది? కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మద్దతుతో కాదా?
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు తాను లోక కల్యాణం కోసం పాటుపడుతున్నానని అంటున్నారు. రెండెకరాల భూమితో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు లోకాన్ని దోచుకొని కోట్లకు కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని లోకేశ్‌కు ఇస్తారు. ఆయన్నే నమ్ముకొని, జెండా పట్టుకున్న కార్యకర్తలను మాత్రం పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొమ్మని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడూ.. మీ దృష్టిలో లోక కల్యాణం అంటే లోకేశ్‌కు మేలు చేయడమేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ‘‘తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి, నందమూరి కుటుంబాన్ని తొక్కేసి, ఒక్క లోకేశ్‌ను మాత్రమే పైకి తేవాలనుకుంటే అది లోక కల్యాణం అనిపించుకోదు’’ అని చంద్రబాబుకు ఆమె హితవు పలికారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తయి.. తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమండ్రిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. 

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘ఈ రోజు చంద్రబాబు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. చంద్రబాబు తనకు స్వార్థం, పదవీ వ్యామోహం లేవంటున్నారు. అయితే మరి ఎన్టీఆర్‌ను ఆయన ఎందుకు వెన్నుపోటు పొడిచినట్టు? ఆయన కుర్చీని, అధికారాన్ని ఎందుకు లాగేసుకున్నట్టు? పోనీ ఆయన్ను అధికారంలోంచి దింపేశాక, ఎన్టీఆర్ గారికి అంత మంది కుమారులుంటే.. ఏ ఒక్క కుమారుడికీ అధికారం ఇవ్వకుండా అందరినీ తొక్కేసి ఆ కుర్చీలో చంద్రబాబుగారే ఎందుకు కూర్చున్నట్టు? ఈయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని చెప్పినా.. ఆ కుర్చీ మీద కన్నులేదని చెప్పినా కనీసం తెలుగుదేశంవారు కూడా నమ్మరు. నిజంగా మీరురాష్ట్రంలో వెలుగులు నింపే వారే అయితే అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు చంద్రబాబూ? నీ హయాంలో రాష్ట్ర ప్రజల బతుకులు ఎందుకు బుగ్గిపాలు చేశారు?

నరకాసురుడికి అధికారం ఇస్తారా?

‘నాకు అధికారం ఇస్తే రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే గాడిలో పెడతాను’ అంటున్నారు చంద్రబాబు. నరకాసురుడు వచ్చి తనకు మళ్లీ అధికారం ఇవ్వండి.. మంచి పాలన చేస్తానంటే ఎవరైనా ఇస్తారా? గాడ్సే వచ్చి మహాత్మాగాంధీ ట్రస్టుకు తనను అధ్యక్షుడిని చేయమంటే చేస్తారా? చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే మన రాష్ట్రానికి అధోగతే. చంద్రబాబు అవినీతి మీద ధర్మ పోరాటం చేస్తున్నారట. కనీసం ప్రజలు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా, ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో విచారణను తప్పించుకోవడానికి చీకట్లోనే చిదంబరాన్ని కలిసి ఒక వైపు వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ.. తనది ధర్మ పోరాటం అంటున్న చంద్రబాబును ఏమనాలి?

కుమ్మక్కైంది టీడీపీనే..

కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు ప్రతిసారీ కుమ్మక్కయ్యారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన చెప్పిందే నిజమైతే.. ఈ రోజు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండేవారా? ఇప్పటికే ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు కాదా? ఈ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డి మీద అబద్ధపు కేసులు పెట్టి ఏడాదిగా జైల్లో పెట్టేలా చేశాయి. చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలకుండా చేయడానికి ఈ చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి మరీ కాపాడారు.

జగనన్న తరఫునే ఈ పాదయాత్ర..

నాన్నగారు బతికే ఉన్నా.. జగనన్న బయటే ఉన్నా.. నేను ఈ రోజు ఈ పాదయాత్ర చేసే అవసరమే వచ్చేది కాదు. కానీ వైఎస్సార్ పాదయాత్రలో, ఆయన వ్యక్తిగత ఇమేజ్‌తో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం కృతజ్ఞత కూడా లేకుండా వైఎస్సార్‌ను దోషి అని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చింది. ఆయన కుమారుడిని రాజకీయంగా తొక్కేయాలని ఒక్కడి చుట్టూ 100 కుట్రలు పన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేలా చేసింది. జైల్లో ఉండి కూడా మన రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్న జగనన్న తర పున నేను ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాను. అందుకే ఈ రోజు ఇలా మీ ముందు నిలబడ్డాను.’’

13 కిలోమీటర్ల మేర యాత్ర: పాదయాత్ర 169వ రోజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలోని మెరక వీధి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నడుచుకుంటూ షర్మిల కొవ్వూరు-రాజమండ్రి మధ్య ఉన్న రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. జోరు వానలో తడుస్తూనే రాజమండ్రికి చేరుకున్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి సెయింట్ పాల్ చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,235.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసురారెడ్డి, పశ్చిగోదావరి జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే బాలరాజు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, పేర్ని నాని, బాబూరావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, భాస్కర రామారావు, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.

న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్న సీబీఐ

గూడూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా నిర్బంధించడం ముమ్మాటికీ కుట్రపూరితచర్యేనని పలువురు న్యాయవాదులు, మేధావులు, సామాన్యప్రజలు అభిప్రాయపడ్డారు. కేంద్రం సీబీఐని కీలుబొమ్మలా ఆడిస్తోందన్నారు. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాల్లేని కేసులు బనాయించి జగన్‌కు బెయిల్ రాకుండా సీబీఐతో పాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ భవన్‌లో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చైతన్యపథం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ పొందిన నేత అయ్యారు. అసమర్థ పాలనతో కుదేలవుతున్న అధికార కాంగ్రెస్, కుదేలైన టీడీపీ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం ఆరోపణలతోనే ఏడాదిగా జైల్లో ఉంచడం దారుణమన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐని, న్యాయవ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్నే అవహేళన చేస్తున్నాయన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎదురు తిరిగినందుకే సీబీఐని ఉపయోగించి జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. 

ఈ కేసులు ఆయన్నేమీ చేయలేవని, త్వరలో కడిగిన ముత్యంలా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని పట్టించుకోని సీబీఐ, కేవలం ఆరోపణలకు సంబంధించి జగన్‌పై ఏళ్లతరబడి విచారణ చేయడం, ఏడాదిగా జైలులో నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానంతో మృతి చెందారని, వారిని ఓదారుస్తానని జగన్‌మోహన్‌రెడ్డి మాటిచ్చి ఓదార్పుయాత్ర చేపట్టారన్నారు. అదే పెద్ద తప్పన్నట్లు కాంగ్రెస్ పెద్దలు జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులను వేధించడం సబబు కాదన్నారు. కాంగ్రెస్ పెద్దలు జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచాక బహిరంగసభల్లో మాట్లాడుతూ, జగన్ పార్టీ వీడకుంటే సీఎం అయ్యేవాడంటూ చెప్పడాన్ని బట్టే ఇది ఎంత కుట్రపూరిత చర్యో తెలుస్తుందన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గద్దె దిగకుండా చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తుండడాన్ని బట్టే కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు తెలుస్తోందన్నారు. సీబీఐని పావుగా వాడుకుంటూ జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నాయన్నారు. న్యాయవాది బాబురెడ్డి మాట్లాడుతూ, న్యాయస్థానాలు సీబీఐని తప్పుబడుతున్నా.. వారికి చలనమే లేదన్నారు. ఎలాంటి కేసుకైనా అరెస్టయిన 90 రోజుల్లో బెయిల్ రావాల్సి ఉండగా ఏడాదిగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచడం ముమ్మాటికీ కుట్రేనన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అన్నారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తెలంగాణ రాబందుల పార్టీ

రాజకీయ పార్టీలు ఒకదానిని ఒకటి విమర్శించుకోవడానికి కొత్త,కొత్త డైలాగులు కనిపెడుతుంటాయి. టిడిపిని తెలంగాణ ద్రోహుల పార్టీగా టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల పార్టీగా టిడిపి వ్యాఖ్యానించింది.టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క,సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.తెలంగాణలో పలువురు మరణానికి కారణం టిఆర్ఎస్ అని వారు వ్యాఖ్యానించారు.అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు.సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు ఎందుకు కలిగిందని వారు సూటిగా ప్రశ్నించారు. కడియంకు పదవీపై ఆశ లేకుంటే హన్మకొండ సీటును అమరవీరుల కుటుంబానికి ఇవ్వగలరా అని వారు అన్నారు.మొత్తం మీద తెలంగాణలో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్న తీరు గందరగోళంగా మారుతోంది.

బీజేపీతో మాది మిత్ర వైరుధ్యమే: కేటీఆర్

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో తమకు మధ్య ఉన్నది మిత్రవైరుధ్యం మాత్రమేనని.. శత్రుత్వం కాదని టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ కోరుకునే ఏ సంస్థలకు చెందిన వారినైనా తాము సోదరులుగానే చూస్తామని తెలిపారు. వారితో చిన్నచిన్న అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ, యూపీఏ తెలంగాణ ఇస్తామంటూ మో సం చేశాయని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణ కోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నప్పుడు ఏ ఒక్క రోజూ బీజేపీ సభ్యులు కలిసి రాలేదని తెలిపారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు వల్లే తెలంగాణ ఇవ్వలేకపోయామని చెబుతున్న బీజే పీ నేతలు.. రేపు వెంకయ్యనాయుడు అడ్డు అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. 

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేడు సాగేదిలా

రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో బుధవారం (170వ రోజు) సాగించే పాదయాత్ర వివరాలను కో ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ప్రకటించారు. రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చి వద్ద నుంచి షర్మిల బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తారు. 5.4 కిలోమీటర్ల నడక అనంతరం శానిటోరియం సమీపంలో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం 8.9 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగిస్తారు. మధురపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటలో రాత్రి బస. బుధవారం మొత్తం 14.3 కిలోమేటర్ల మేర ఆమె పాదయాత్ర సాగుతుంది.

పర్యటించే ప్రాంతాలు
రాజమండ్రి నగరంలోని సెయింట్‌పాల్స్ చర్చి, ఆజాద్‌చౌక్, నందం గనిరాజు సెంటర్, కంబాలచెరువు, వివేకానందచౌక్, రాజా థియేటర్ సెంటర్, క్వారీ మార్కెట్ సెంటర్, శానిటోరియం సెంటర్, కొంతమూరు, కోలమూరు, గాడాల, మధురపూడి.

కెసిఆర్ ప్రజల ఆస్తి

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై చేసిన విమర్శలను ఆయన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు ఘాటుగా తిప్పికొట్టారు.తాము ఉద్యమంలో పాల్గొంటే మీరు పదవులలో కులుకుతారా అని ఆయన సీరియస్ గా ప్రశ్నించారు.తెలంగాణ ద్రోహులు చట్టసభలలో ఉంటే,తెలంగాణ బిడ్డలు రోడ్లపై ఉండాలా అని ఆయన ప్రశ్నించారు.టిఆర్ఎస్ కు ఓట్లు ,సీట్లు రాకూడదా అని కెటిఆర్ ప్రశ్నించారు.ఓట్లు,సీట్లతోనే టిఆర్ఎస్ రాజకీయ అస్థిత్వాన్ని సాధిస్తుందని ఆయన స్పష్టం చేవారు.మంత్రి శ్రీధర్ బాబును మంధని దాటితే ఎవరూ గుర్తించరని, కెసిఆర్ ఇప్పటికే మూడు జిల్లాలలో గెలిచారని ఆయన అన్నారు.కెసిఆర్ ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
కెసిఆర్ ఎక్కడ నుంచి పోటీచేసినా గెలుస్తారని తారకరామరావు సవాల్ చేశారు.

జానా మాటలు ఏమి చెబుతున్నాయి..

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ప్రకటనలు ఒక్కోసారి భలేగా ఉంటాయి.తెలంగాణపై ఆయన చేసిన ప్రకటన అలాంటిదే.తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అంటున్నారు. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని చెబుతూ, తెలంగాణపై అధిష్టానం మరోసారి చర్చలకు పిలుస్తుందని జానా అంటున్నారు.చర్చలు నిరంతర ప్రక్రియ అంటే ఇప్పట్లో తేలదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా?అయితే అదే సమయంలో యధా ప్రకారం అదిష్టానంపై నమ్మకం ఉంచారు.కాగా పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడడానికి అజాద్ పిలిపించారని ఆయన వెల్లడించడం విశేషం. అంటే చివరికి పంచాయతీ ఎన్నికలు పెట్టాలా?వద్దా?అన్నదానిపై కూడా డిల్లీ పెద్దలే నిర్ణయించాల్సి వస్తున్నదని అనుకోవాలా?ఈ నెల 11లోపు పంచాయతీ రిజర్వేషన్లు పూర్తిచేస్తామన్నారు. జులై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలుంటాయని , ఆగస్టు చివరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుండే అవకాశం ఉందని జానారెడ్డి తెలియచేశారు.కాగా మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్‌ గురించి బాధపడుతున్నానని అనడం విశేషం.

వై.ఎస్.ను తిడితే పదవి ఇచ్చారుగా..

డాక్టర్ డి.ఎల్.రవీంద్ర రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడంపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది.దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిడితే మంత్రి పదవులు ఇచ్చారని, కిరణ్‌ను తిడితే మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. డి.ఎల్.గతంలో వై.ఎస్.ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని జూపూడి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి అని ఆయన ఎద్దేవ చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు నమ్మదగిన నేత వైఎస్ జగన్ ఒక్కరే అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, కిరణ్‌లకు ఓటమి తప్పదన్నారు. రాష్ట్రంలో నమ్మడానికి వీల్లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబే అని జూపూడి విమర్శించారు.కాంగ్రెస్ లో అయినా ఏ పార్టీలో అయినా అధికారంలో ఉన్నవారిని తిడితే ఊరుకుంటారా?ఆ సంగతి జూపూడికి తెలియనిదా!

అప్పట్లో నాగం, కెసిఆర్ లు ఒక గూటి పక్షులే!

మున్ముందు రోజులలో బిజెపి, టిఆర్ఎస్ లకు మధ్య కూడా మాటల యుద్దం ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి.గతంలో నాగం జనార్ధనరెడ్డి తెలంగాణ కోరుకునే నాయకులు ఒకరినొకరు విమర్శించుకోకూడదని అంటుండేవారు. ఆయన ఇప్పుడు ఒక పార్టీలోకి వచ్చాక దానిని పక్కన బెట్టి విమర్శల పర్వంలోకి దిగారు.స్టేషన్ ఘనపూర్ లో కెసిఆర్ ఈయనపై విమర్శలు చేశారు. దానికి బదులు చెబుతూ, టీఆర్‌ఎస్ ఆవిర్భావం ముందే బీజేపీ రెండు రాష్ట్రాలు కావాలి కోరిందని నాగం చెప్పారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అడ్రస్ ఎక్కడ అని ఆయన అడిగారు. కేసీఆర్ నిక్కర్ వేసుకున్నప్పుడే ఉద్యమంలో జైలుకెళ్లానని నాగం అంటున్నారు. 2001లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని కేసీఆర్ భావిస్తున్నారని... తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలుసుకోవాలంటూ కేసీఆర్ కు నాగం సలహా ఇచ్చారు.చిత్రం ఏమిటంటే వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు ఆ పార్టీ వైఖరిని అనుగుణంగా ఇద్దరిని సమైక్యవాదులగానే పరిగణించాలి.నాగం అయితే ఒక సందర్భంలో రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరంపై శాసనసభలో మాట్లాడితే,కెసిఆర్ ఏకంగా ఆరుసూత్రాల పధకాన్ని 610 జిఓను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.ఇక 1969 నాటికి కెసిఆర్ పదిహేనేళ్ల లోపు వయసు కలిగిన వ్యక్తి కనుక ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి అప్పట్లో ఆయనకు అవగాహన ఉండకపోవచ్యు.అంత మాత్రాన నాగం తాను సీనియర్ అనుకుంటే ఎలా?నిజానికి రెండువేల ఒకటిలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఆరంభించాకే దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నది వాస్తవం.