Sunday 12 May 2013

వై.ఎస్ జగన్ నిర్దోషి అని తేలితే... షర్మిల ప్రశ్న

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి , పాదయాత్రికురాలు షర్మిల ఒక సాంకేతిక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఓ వ్యక్తిని దోషీ అని చెప్పకుండా జైల్లో ఎలా పెడతారని, జగన్ నిర్దోషి అని తేలితే జైలు జీవితాన్ని వెనక్కి ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు.కాంగ్రెస్-టిడిపి కలిసి జగనన్నను జైలుపాలు చేశారని, సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై కుట్రలు పన్నుతున్నారని, కుంటిసాకులతో జగనన్నను జైల్లో పెట్టారని షర్మిల ఆరోపించారు. ఛార్జీషీట్‌లో పేర్లున్న మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదని...ఎంపీగా వున్న జగన్ ను ఎలా అరెస్ట్ చేశారని షర్మిల ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ సంస్థలు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాయని షర్మిల విమర్శించారు.షర్మిల లేవనెత్తిన ప్రశ్నలలో కొంత అర్దం ఉందని చెప్పాలి.బెయిల్ ఇచ్చే కారణమే బహుశా అది అయి ఉంటుంది.కోర్టులలో శిక్ష పడితే అది వేరే విషయం.అలాకాకుండా విచారణ పేరుతో నెలల తరబడి జైలులో ఉంచడం అంత పద్దతిగా కనిపించదు. సుప్రింకోర్టు సైతం విమర్శలకు అతీతంగా తీర్పులు ఇవ్వకపోతే దేశంలో న్యాయవ్యవస్థ పై ప్రజలలో సందేహాలు వచ్చే ప్రమాదం ఉంది.

జగన్.. జైల్లో కాదు జనం గుండెల్లో ఉన్నారు : ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో లేరని జనం గుండెల్లో ఉన్నారని టీడీపీ మాజీ నేత, ప్రస్తుత వైఎస్ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 
ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులను తొలగించిన కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్రంలో ఆరోపణలున్న మంత్రులను ఎందుకు తొలగించలేదని నిలదీశారు. మంత్రులు రహస్యాలను బయటపెడతారనే భయం ప్రభుత్వానికి పట్టుకుందని, అందువల్లే వారిని తొలగించడం లేదన్నారు. 

రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క చంద్రబాబేనని విమర్శించారు. పార్టీ వదిలినవారిని విమర్శించడం మాని.. బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.

చంద్రబాబుపై ఉమ్మారెడ్డి వ్యాఖ్యలు

ప్రజల విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు చంద్రబాబు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరిన టిడిపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ వదిలినవారిని విమర్శించడం మాని, బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. అవినీతి ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. విచారణ గడువు పొడిగించాలని న్యాయవాది అశోక్‌భాను చెప్పడం సీబీఐ ఆంతర్యమా? సోనియా ఆంతర్యమా అని ఆయన ప్రశ్నించారు. జైలులో ఉన్నా జనం గుండెల్లో వైఎస్ జగన్ ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రంలో మంత్రులను తొలగించిన కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులను తొలగించకపోవడంలో ఆంతర్యం రహస్యాలు బయటపడతారనా అని ఉమ్మారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో టిడిపి నేతలు చేరడం, వారితోనే చంద్రబాబు పై విమర్శలు చేయించడం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే ఉందని భావించాలి.

వై.ఎస్ జగన్ పార్టీకి కొత్త ఊపిరి ఇచ్చేది వీరే!

కాంగ్రెస్ నేతలు ఒక్కోసారి ఒక్కో వ్యాఖ్య చేస్తుంటారు.దానితో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అదినేతకు వాదనకు మంచి పాయింటు దొరుకుతుంటుంది.అసలే జగన్ పై రాజకీయ కేసు పెట్టారని విమర్శలు వస్తుంటే, గత ఉప ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి అజాద్ వాటిని నిజం చేస్తున్నట్లుగా జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారని అన్నారు. ఈ మధ్య మరో మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్ లో కలిసేవరకు బెయిల్ రాదని వ్యాఖ్యానించారు. తాజాగా మరో సీనియర్ నేత , ఆర్టీసి ఛైర్మన్ ఎమ్.సత్యనారాయణరావు జగన్ కొత్త పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావని వ్యాఖ్యనించారు.ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగి ఉంటే ఈ సమస్యలే ఉండేవి కావని, ఇన్ని కష్టాలు పడేవారు కారని వ్యాఖ్యానించారు. ఈ రకంగా జగన్ పై కాంగ్రెస్ కక్ష పూని కేసు పెట్టించిందని,నిర్బందించిందని , బెయిల్ రాకుండా చేస్తున్నదని వీరే చెబుతున్నట్లుగా ఉంది. అదే జగన్ పార్టీకి ఎప్పటికప్పుడు కొత్త ఊపిరి ఇస్తోందనుకోవచ్చు.

ఇది కోర్టు ధిక్కారం కాదా?

    ఎవరిని కరవమంటే వారిని కరుస్తుంది
* సీబీఐ, ఈడీలపై నిప్పులు చెరిగిన షర్మిల
*కాంగ్రెస్‌ను వ్యతిరేకించినందుకే జగన్‌పై అబద్ధపు కేసులు
* కేంద్రం పంజరంలో తాము చిలుకలమని సీబీఐ డెరైక్టరే అంగీకరించారు
* ఆ చిలుక పలుకులు విని సుప్రీంకోర్టు జగన్‌కు బెయిల్ నిరాకరించడం దురదృష్టకరం
* బొగ్గు స్కామ్‌పై సీబీఐ నివేదికను న్యాయశాఖ, పీఎంవోల్లోని వారు ఇష్టానుసారం మార్చారు
*అయినా అక్కడ అరెస్టులు చేయరు.. జగన్ ఎవరినీ ప్రభావితం చేయకున్నా అరెస్టు చేశారు
*సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం ఉన్న మంత్రులను మాత్రం అరెస్టు చేయలేదేం?
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘సీబీఐ దర్యాప్తు చేసే సంస్థ కానేకాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం పెరట్లో పెంచుకునే కుక్క. కేంద్రం ఎవరి మీద మొరగమంటే సీబీఐ వాళ్ల మీద మొరుగుతుంది. ఎవరిని కరవమంటే వాళ్లను కరుస్తుంది. మొరుగుతుండగానే ఇక చాలు ఆపు అని కేంద్రం చెప్పగానే వెంటనే ఆపేసి వెనక్కి వస్తుంది. మరి ఇలాంటి సీబీఐ, ఈడీ సంస్థలను దర్యాప్తు సంస్థలు అనాలా? లేక కేంద్ర ప్రభుత్వం ఎలా పలకమంటే అలా పలికే చిలుకలు అనాలా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పే కుక్కలు అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఘాటుగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సాగింది. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో కిక్కిరిసి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ములాయం కూడా చెప్పారు.. ‘‘ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు సీఎంగా పని చేసిన ములాయం సింగ్ యాదవ్.. కాంగ్రెస్, సీబీఐ సంబంధం గురించి ఒక మాట అన్నారు. ‘కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అంత సులభం కాదు. కాంగ్రెస్‌కు వెయ్యి తలలుంటాయి. దాన్ని వ్యతిరేకిస్తే వెయ్యి పడగలతో కాటేస్తుంది. సీబీఐని ఉసిగొల్పుతుంది. జైల్లో కూడా పెడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలను నిజం చేస్తూ.. తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి.. యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్న 24 గంటల్లోనే ఆయన సొంత మనుషుల ఇంటి మీద సీబీఐ, ఈడీ విరుచుకుపడ్డాయి. దీని మీద పార్లమెంటులో దుమారం రేగడంతో.. ప్రధాని మన్మోహన్ సింగ్ మాటల మేరకు ఈ సీబీఐ, ఈడీలు వెనక్కి వెళ్లిపోయాయి. అంటే ఈ సీబీఐ, ఈడీలు వెళ్లింది విచారణ చేయడానికి కాదు, దర్యాప్తు చేయడానికి అంతకంటే కాదు. ఆలోచన ఉన్న వాళ్లు ఎవరు ఆలోచన చేసినా ఇది అర్థమవుతుంది.
సీబీఐ ఒక బ్లాక్ మెయిల్ సంస్థ..
జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనేఉంటే ఈ పాటికి ఏ మంత్రో.. ముఖ్యమంత్రో అయి ఉండేవారని, కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకే అన్ని అష్ట కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత గులాం నబీ ఆజాదే స్వయంగా ఒప్పుకొన్నారు. జగనన్న కాంగ్రెస్‌ను వ్యతిరేకించారు కాబట్టే ఆయన మీద సీబీఐని, ఈడీని ఉసిగొల్పి అబద్ధపు కేసులు పెట్టారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ కాదు, ఒక బ్లాక్‌మెయిల్ సంస్థ. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పంజరంలో తాము చిలుకలమని ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ స్వయంగా ఒప్పుకున్నారు. కేంద్రం ఎట్లా చెప్తే అట్లా పలికే సీబీఐ చిలుక పలుకులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు జగనన్నకు బెయిల్ నిరాకరించడం చాలా దురదృష్టకరం.

ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం క్విడ్ ప్రో కో కాదా?
వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు ఆయన మీద ఏ కేసులూ లేవు. జగన్‌మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ను వదిలేశాక వైఎస్సార్‌ను దోషి అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టారు. ఆ తరువాత జగనన్న మీద కేసులు పెట్టారు. సోనియా గాంధీ ఆదేశాల మేరకే కేసులు పెట్టామని శంకర్రావు అనే ఎమ్మెల్యే చెప్పారు. కేసులు పెట్టినందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇలా చేయడం క్విడ్ ప్రో కో కాదా? ఈ క్విడ్ ప్రో కో గురించి ఎవరూ మాట్లాడరు. ఈ క్విడ్ ప్రో కోను ఎవరూ పరిగణనలోకి తీసుకోరా?

ఇది కోర్టు ధిక్కారం కాదా?
ఇంకా ఎన్ని రోజులని, ఎంతకాలమని జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచుతారు? సుప్రీంకోర్టు నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని నిన్న చెప్తే అది చెప్పిన ఐదు నిమిషాలకే సీబీఐ న్యాయవాది బయటికి వచ్చి అలాంటి గడువు ఏదీ లేదని అంటారు. గతంలో అదే కోర్టు అన్ని అభియోగాలనూ కలిపి ఒకే చార్జిషీటు వేయాలని చెప్తే ఈయన గారేమో వచ్చే పది రోజుల్లో మూడు చార్జిషీట్లు వేస్తామని చెప్పారు. అంటే ఇది సుప్రీంకోర్టును, సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ ధిక్కరిస్తున్నట్టు కాదా? సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ వ్యతిరేకించినట్టు, బేఖాతర్ చేసినట్టు కాదా? సుప్రీంకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందనే ఆశిస్తున్నాం.

వారిని అరెస్టు చేయలేదే?
బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చే నివేదికలను ముందుగానే న్యాయశాఖ మంత్రి కార్యాలయం వారు, ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్న వారు, అడ్వొకేట్ జనరల్ అందరూ కలిసి చూసి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేశారు. నివేదికను ఇష్టమొచ్చినట్లు మార్చారు. కానీ అక్కడ ఏ అరెస్టులూ జర గలేదు. ఇక్కడమటుకు జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేశారు అనడానికి ఏ ఆధారాలు లేకపోయినా... ఏ ఒక్క రోజు కూడా సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోయినా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఏ చార్జిషీట్లో జగనన్న పేరుందో అదే చార్జిషీట్లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న హోం మంత్రి పేరు కూడా ఉంది. అంటే ముఖ్యమంత్రి తరువాత మనిషి అన్న మాట. కానీ సాధారణ ఎంపీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డేమో.. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆయన్ను అరెస్టు చేశారు. సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం ఉన్న ఈ మంత్రులను మాత్రం ఇంత వరకు సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేదో సమాధానం చెప్పాలి. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయం, మంత్రులకు మరొక న్యాయం. కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వారికి ఒక న్యాయం, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే వారికి ఇంకొక న్యాయం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మన దేశంలో, మనరాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే మన నాయకులు న్యాయాన్ని బతకనిస్తారా? అని అనుమానం కలుగుతోంది.’’

11 కిలోమీటర్ల మేర యాత్ర..
షర్మిల పాదయాత్ర 145వ రోజు శనివారం ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కిష్టారం గ్రామ శివారు నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ షర్మిల సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి తాళ్లమడ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.40 గంటలకు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సత్తుపల్లిలో షర్మిలను కలిసి బాగోగులు తెలుసుకున్నారు. షర్మిల శనివారం మొత్తం 11 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,940.6 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, జలగం వెంకటరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, నేతలు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాశ్, భానోతు మదన్‌లాల్, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, రామసహాయం నరేష్‌రెడ్డి, సాదు రమేష్‌రెడ్డి, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

నేడు‘పశ్చిమ’లోకి షర్మిల యాత్ర
షర్మిల పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కన్వీనర్ బాలరాజు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పాకలవారంగూడెం గ్రామం దాటడంతో ఖమ్మం పాదయాత్ర పూర్తి అవుతుందని వారు తెలిపారు. చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం ద్వారా షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారని చెప్పారు.

నాడు వైఎస్.. నేడు షర్మిల
మండే ఎండల్లో పాదయాత్ర

నాడు చంద్రబాబు తొమ్మిదేళ్ల ఏలుబడిలో.. పంటలు పండక, పని దొరక్క, పన్నులు కట్టలేక జనం విలవిల్లాడిపోతుంటే.. భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే మే నెలలో మండే ఎండల్లో.. యాత్ర చేశారు. ఆ యాత్ర 2003 మే 11న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చేరింది. అప్పుడు ఇక్కడి ఉష్ణోగ్రత 45.5 డిగ్రీలు. ఆయనలాగే జనం కూడా ఎండకు వెరవకుండా వైఎస్ వెంట వెల్లువలా తరలివచ్చారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత శనివారం అదే సీన్ రిపీటైంది. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కాకతాళీయంగానే మే 11న సత్తుపల్లికి చేరింది. ఇప్పుడిక్కడ ఎండ తీవ్రత 46 డిగ్రీలు. అంతటి ఎండలోనూ షర్మిల ఆగకుండా నడిచారు. జనం కూడా ఆమెలాగే ఎండను లెక్కచేయకుండా కెరటంలా తరలివచ్చారు. పదేళ్ల కిందట వైఎస్సార్ మాట్లాడిన సత్తుపల్లి బస్టాండ్ సెంటర్‌లోనే షర్మిల ప్రసంగించడం విశేషం.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
శనివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 145, కిలోమీటర్లు: 1,940.6

ఆ మంత్రుల్ని తక్షణమే తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్: కేంద్రమంత్రులు బన్సల్, అశ్వనీకుమార్‌లను తొలగించినట్టే.. సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకున్న రాష్ట్ర మంత్రులందరితోనూ రాజీనామా చేయించాలని బీజేపీ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. మంత్రులపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసినా, కోర్టులు అనుమానాలు వ్యక్తంచేసినా ఇంకా వారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఏ నైతిక ప్రమాణాలకు నిదర్శనమో చెప్పాలని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు కాంగ్రెస్‌ను నిలదీశారు. 

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 147వ రోజు సోమవారం 13.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చింతలపూడి మండలం రాఘవాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సమ్మిరివారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
రాఘవాపురం, డీఎన్ రావుపేట, పోతునూరు, మల్లయ్యగూడెం, ఆముదాలచలక, సమ్మిరివారిగూడెం 

3న నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరిక?

హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి కన్వీనర్ నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే నెల 3న కాషాయతీర్థం తీసుకునే అవకాశముంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరితో నాగం చర్చలు జరిపారని, బీజేపీలో చేరాల్సిందిగా సూచించారని తెలిసింది. 

నేడు కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం


బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడి శ్రీకంఠీరవ స్టేడియంలో గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.

సిద్ధరామయ్య సొంత జిల్లా మైసూర్, తదితర ప్రాంతాల నుంచి 50 వేల మంది హాజరవుతారని అంచనా. కార్యక్రమంలో సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య సారథ్యంలో కాంగ్రెస్.. బీజేపీపై విజయం సాధించడం, ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికవడం తెలిసిందే. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆరేళ్ల కిందట జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చే రారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. రాష్ట్రానికి 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వచ్చే వారంలో కేబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీబీఐ: గట్టు రామచంద్రరావు

వరంగల్: సీబీఐ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత గట్టు రామచంద్రరావు ఆరోపించారు. వైఎస్ జగన్ విషయంలో ఒకలాగ, బొగ్గు కుంభకోణంలో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. నిజాయితీగా విచారణ చేపట్టాల్సిన సీబీఐ.. ద్వంద ప్రమాణాలను పాటిస్తోందని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విప్ ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై రేపు విచారణ

హైదరాబాద్: శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై రేపు, ఎల్లుండి విచారిస్తారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఎదుట ఎమ్మెల్యేలు విడివిడిగా హాజరై వివరణ ఇస్తారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారణ ప్రక్రియ జరుగుతుంది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది రేపు వివరణ ఇస్తారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు 9 మంది ఎల్లుండి వివరణ ఇస్తారు.

YS జగన్ బయటకు రాకుండా కుట్ర: కొణతాల

హైదరాబాద్: పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆదేశాలతో మేరకే సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహరాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను బయపెట్టడానికి సీబీఐని వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వైఎస్‌ జగన్‌ను జైలు నుంచి బయటకు రాకుండా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. 

సోనియాగాంధీపై కూడా లక్ష కోట్ల ఆరోపణ


తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన లక్ష కోట్ల ఆరోపణలు చేశారో, ఇప్పుడు దేశంలో మరికొందరు రాజకీయ ప్రముఖులు కూడా అదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీపై ఈ ఆరోపణ చేశారు.
సోనియా గాంధీకి విదేశాల్లో లక్షల కోట్ల రూపాయల డబ్బు దాచారని ఆయన అభియోగం మోపారు. ఆ వివరాలు త్వరలోనే బయటపెడతానని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రధాని మన్మోహన్ మాత్రం సైలెంట్‌లో ఉన్న ఫోన్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు .

టిడిపిది భావదారిద్ర్యం

తెలుగుదేశం పార్టీ బావదారిద్ర్యంలో ఉందని పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేయడం కాకుండా, దమ్ముంటే టిడిపి నేతలు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించాలని సూచించారు.తనను రాజకీయ వ్యభిచారి అనడాన్ని,తాను దళితుడుని కానని టిడిపి నేతలు మోత్కుపల్లి , ఇతర నేతలు ప్రచారం చేయడం మానుకోవాలని,టిడిపికి ఏమి చెప్పాలో తెలియక ఇలాంటి బావదారిద్ర్యపు మాటలు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.