Saturday 25 May 2013

జగనన్నను ఎవరూ ఆపలేరు: YS షర్మిల


భీమవరం: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని రైతులకు ఒక్క రూపాయికి సహాయం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేశారని గుర్తు చేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా లక్షల కోట్లు విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి అంటే ఇలావుండాలని చూపిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చార్జీలు పెంచలేదని తెలిపారు. 

కిరణ్ సర్కారు ప్రజలను కాల్చుకు తింటోందని అన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలో వేల పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా కరెంట్ చార్జీలు పెంచిందన్నారు. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలకుండా చంద్రబాబు కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో ఊడిపడిన కిరణ్ కు ప్రజలు కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడే జనం గురించి ఆలోచిస్తారని చెప్పారు. 

అవిశ్వాసానికి మద్దతు ఇచ్చివుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదన్నారు. చంద్రబాబుకు పదవీకాంక్ష లేకుంటే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచేవారా? అని నిలదీశారు. అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. జైలులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్నను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి హామీ నెరవేరుతుందన్నారు. అందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. ఆ రోజు వచ్చే వరకు జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని కోరారు. 

0 comments:

Post a Comment