Saturday 4 May 2013

ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ వెళ్లిపోతారు

బాబు పాదయాత్ర చేస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు
ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ వెళ్లిపోతారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాయకత్వంపై విశ్వాసం సడలిపోయినందునే నాయకులు ఆ పార్టీని వీడిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నుంచి శాసనమండలిలో మాజీ ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు వరకు సీనియర్ నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పడాన్ని పరిశీలిస్తే బాబును ఎవరూ నమ్మడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. 

జూపూడి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత చంద్రబాబు ఇక ఈ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అయినట్లు, అధికారం తనదే అయినట్లు కలలు కన్నారని... జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తిరుగులేని ప్రజాదరణను పొందడంవల్ల తన ఆశలు అడియాసలు అవుతుండడంతో అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వాస్తవాలను పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్‌ను, జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజల్లో అడుగంటిన పార్టీ ప్రతిష్టను పెంచడానికి బాబు పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లారని, ఆయన పెంచుకున్న ప్రతిష్టకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తమ పార్టీ గేట్లు తెరిస్తే ఎంతోమంది వచ్చి చేరడానికి సిద్ధంగా ఉన్నారని బాబు చెప్పడం హాస్యాస్పదమనీ, వాస్తవానికి ఆయన గేట్లు తెరిస్తే ఉన్నవారందరూ పొలోమని వెళ్లిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. 

0 comments:

Post a Comment