Tuesday 14 May 2013

మాట మీద నిలబడినందుకే ప్రజలంతా YS జగన్ వైపు


ఒకే ఒక్కమాట... నల్లకాలువలో అడవితల్లి సాక్షిగా ఇచ్చిన మాట.... ‘నా తండ్రి అకాల మరణం తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను. ఓదారుస్తాను’ అని ఇచ్చినమాట. ఆ మాటకు కట్టుబడినందుకే కాంగ్రెస్ జగన్‌ని కాదనుకుంది. పొమ్మనలేక పొగబెట్టింది. జగన్ మాత్రం ఇచ్చినమాటకు కట్టుబడి తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్‌పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. లీడర్ అంటే ఎలా ఉండాలో ఆచరణలో చూపారు. మాట తప్పని, మడమ తిప్పని ఆ నైజం నచ్చి జనం జగన్‌ని తమ గుండెలకు హత్తుకున్నారు. ఫలితం... కడప పార్లమెంటుకు జరిగిన ఉపఎన్నికల్లో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆధిక్యత. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్‌పార్టీ కన్ను మళ్లీ జగన్‌పై పడింది.

అయినా జగన్ లొంగలేదు. దాంతో కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా కలసి ఆయన్ని అరెస్టు చేయించాయి. అయినప్పటికీ జగన్ ఎంతో ధైర్యంగా, నిబ్బరంగా ఉండడం చూసిన కాంగ్రెస్ ఉక్రోషంతో ఆయనకు బెయిల్ రాకుండా చేస్తోంది. ఈ విషయాలన్నీ ప్రజల దృష్టిని దాటిపోలేదు. అందుకే వారు జగనన్న వైపే ఉన్నారు. ఎప్పటికీ జగనన్నతోనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పట్టం కడతారు.
- ఎద్దు వెంకటేశ్వర్లు, గార్ల, ఖమ్మం

జగన్‌ని నైతికంగా ఎదుర్కోలేకే ఈ దుష్టశక్తులన్నీ ఏకమయ్యాయి..!
జగన్‌గారిని అరెస్టు చేసి ఏడాది కావస్తోంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఆయన్ని నిర్బంధంలో ఉంచుతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం! జగన్ ఓదార్పుయాత్ర చేయడం గిట్టని కొన్ని శక్తులు కాంగ్రెసు అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపి ఆయనకు అన్నివిధాలా అవరోధాలు కల్పించారు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం, ప్రజల కష్టాలలో పాలుపంచుకోవడం వంటి గుణాలను తండ్రి నుండి నేర్చుకున్న జగన్... తను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజా సంక్షేమం కోసం నూటపాతిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను వీడి ఏ క్షణమైతే బయటికి వచ్చారో ఆ క్షణం నుంచే ఆయనపై కాంగ్రెస్ వేధింపులు మొదలయ్యాయి.

కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టిన మూడుపదుల తెలుగుదేశంపార్టీ ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేయి కలిపి ఆయనపై దుష్ర్పచారం చేస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఎల్లో మీడియా వంత పాడడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఒక్క వ్యక్తిని ఎదుర్కొలేక ఇన్ని శక్తులు కుయుక్తులు పన్నడం చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారాయా అని బాధ కలుగుతోంది. రాజశేఖర్‌రెడ్డిగారి వల్ల రాజకీయ జీవితం పొంది పదవులు అనుభవిస్తున్న వారు ఆయన మరణానంతరం అధికార కాంక్షతో కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి ఉండవచ్చు కానీ... రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలవల్ల లబ్ధి పొందిన ప్రతి కుటుంబం జగనన్నకు అండగా ఉంది. త్వరలోనే ఒక రోజు వస్తుంది. ఆరోజున జగనన్న నిర్దోషిగా బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపించే దిశగా అడుగులు వేస్తాడు. 
- లింగబత్తుల రమేష్, సోమారం, వరంగల్

ఎప్పుడైతే జగన్ అరెస్టయ్యారో...అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయింది
అప్పట్లో జగన్ ఎం.ఎల్.ఏ. కాదు, ఎం.పి. కాదు. ఏ జీవోలకూ సంబంధం లేదు. కానీ ఆ 26 జీవోలతో సంబంధం అంటగట్టి, పెట్టుబడులను ఆకర్షించారని అభియోగం మోపారు. అక్రమంగా అరెస్టు చేయించారు. ఈ అక్రమ అరెస్టును ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా... రాష్టంలో గానీ, కేంద్రంలో కానీ పాలకులు పట్టించుకోవడం లేదు. కనుక అంతకంతా వచ్చే ఎన్నికల్లో వీరు అనుభవిస్తారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమూ నిలబడలేదనీ, ప్రజల తీర్పే అంతిమమని చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది.

కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కలిసి జగన్‌పై ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేయటానికి కనిపిస్తున్న కారణం ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అపారమైన ప్రేమ, విశ్వాసం చూసి జీర్ణించుకోలేక వీళ్లంతా ఇన్ని కుయుక్తులు పన్నుతున్నారు. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేయించి, తద్వారా బెయిల్ రాకుండా చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలని ఈ రెండుపార్టీలూ ప్రయత్నిస్తున్నట్లు ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. 
- వి.శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంపట్నం, కృష్ణాజిల్లా

0 comments:

Post a Comment