Tuesday 28 May 2013

అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: YS విజయమ్మ

హైదరాబాద్ : ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె అన్నారు. సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. 

జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారం ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత తమ కుటుంబం ఎన్నో బాధలు పడిందన్నారు. తమ మానసిక స్థితి చూసి కొందరు ఆనందిస్తున్నారని విజయమ్మ అన్నారు.

విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదని విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. బాబుకు విశ్వసనీయత ఉంటే తెలుగుదేశం పార్టీ అలా ఉండేది కాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారని విజయమ్మ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

0 comments:

Post a Comment