
దీనిపై జైళ్ల శాఖ డీజీ టి.కృష్ణరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి సారాంశం.. ‘‘జైళ్ల స్థితిగతులపై.. ముఖ్యంగా చంచల్గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మారుస్తున్నారని, జైళ్లలో ఖైదీలు మద్యం తాగుతూ, నీలి చిత్రాలు చూస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆరోపణలను పలు దినపత్రికల్లో కూడా ప్రచురించారు. ఈ విషయమై ఆయనకు తెలియజేయునది ఏమనగా... చంచల్గూడ జైల్లో స్పెషల్ క్లాస్ ఖైదీలకు ఇచ్చే సదుపాయాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందిస్తున్నాము. జైలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలూ కల్పించడం లేదు. జగన్మోహన్రెడ్డి ములాఖత్ల విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా తెలుగుదేశం పార్టీ వారు కోరిన ప్రతిసారీ సంబంధిత వివరాలను పారదర్శకంగా అందించాము. జైళ్లలో ఖైదీలు మద్యం సేవిస్తున్నారని, నీలి చిత్రాలు చూస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తి అసత్యాలు. అలాంటి నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయం. భారత జైళ్ల వ్యవస్థలో మన్నికైన, ప్రతిభావంతమైనదిగా రాష్ర్ట జైళ్ల శాఖకు పేరుంది. అలాంటి జైళ్ల శాఖపై తీవ్ర ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ జైలు నిబంధనలు- 1979 మేరకు మానవ హక్కుల పరిరక్షణ కల్పనతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఈ శాఖను నిర్వహిస్తున్నాము. జైళ్ల శాఖపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వివరిస్తున్నాము’’
0 comments:
Post a Comment