Tuesday, 30 April 2013

విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై వాదనలు

న్యూఢిల్లీ : ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దుపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. 

వైఎస్ఆర్ సీపీ ఆఫీస్ లో మేడే వేడుకలు

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఉదయం జాతీయ, వైఎస్ఆర్ టీయూసీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు కార్మికులు భారీగా పాల్గొన్నారు. 

Peddayana Peddayana.... YSR Song

పెట్రోల్ ధర 3 రూపాయలు తగ్గింపు ఈ అర్థరాత్రి నుంచే అమలు

న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటర్‌కు మూడు రూపాయలు తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో తాజా ధర 69 రూపాయలుగా ఉండే అవకాశముంది. గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప ధరగా నమోదైంది. మార్చి 2 తేదితో పోలిస్తే పెట్రోలుధర లీటరకు ఎనిమిది రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో మార్చి 2 తేదిన లీటరు పెట్రోలు ధర 77.12 రూపాయలుగా ఉంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే పెట్రోల్ ధరను తగ్గించిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తగ్గిన ధర ప్రకారం ఢిల్లీలో 66.09, కోల్ కతా 73.48, ముంబై 72.88, చెన్నైలో 69.08 గా ఉంటుంది. 

రేపట్నుంచి YSషర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

ముచ్చెర్ల: ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. మేడే సందర్భంగా రేపు ఉదయం 8:30 గంటలకు ముచ్చర్లలో షర్మిల జెండాను ఆవిష్కరిస్తారని రఘురాం తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. 

సీబీఐ పై రాజకీయాలా? సుప్రీం ఆగ్రహం

సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ పై రాజకీయ జోక్యం ఉండరాదని, అలా ఐతే సీబీఐ పై ప్రజలలో గౌరవం తగ్గుతుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం కేసులో సుప్రీంకోర్టుకు ఇవ్వవలసిన నివేదికను ప్రభుత్వానికి సీబీఐ ఇవ్వడం పై కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల కేసు బలహీనపడుతుందని చెప్పింది. దర్యాప్తు సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని తేల్చి చెప్పింది.  సీబీఐకి స్వయం ప్రతిపత్తి పునరుద్దరణకు కృషి చేస్తామని కోర్టు వ్యాఖ్యానించడాన్ని ప్రజాస్వామ్యవాదులు హర్శిస్థున్నరు. కాగా సీబీఐ తీరుతెన్నులపై, స్వతంత్ర ప్రతిపత్తిపై పలువురూ పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, సీబీఐని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్న దన్న వైఎస్ఆర్  కాంగ్రెస్ ఆరోపణలకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు బలపరిచాయీ. జగన్ కేసులో నిందితుడుగా ఉన్న విజయసాయీ రెడ్డి ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి సుప్రీమ్ కోర్టు లో పిటిషన్ వేసి ఉన్నారు. 

సికింద్రాబాద్ లో రేపు వైఎస్ విజయమ్మ రచ్చబండ

సికింద్రాబాద్: ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రేపు సికింద్రాబాద్ లో రచ్చబండ నిర్వహించనున్నారు. అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. మురికివాడల్లోని ప్రజలతో ఆమె సమావేశమవుతారు. 

చంద్రబాబును జనం నమ్మరు: బొత్స సత్యనారాయణ


హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు యాత్ర... 'వస్తున్న నాకోసం' అంటూ సాగిందని ఎద్దేవా చేశారు. బొత్స మంగళవారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బెల్టు షాపులపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ మద్య నిషేదాన్ని విధిస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేశారని, ఇప్పుడు బెల్ట్‌ షాపులను ఎత్తివేస్తామంటున్న బాబును జనం నమ్మరన్నారు. వడ్డీలేని రుణాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారని, పథకాల పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు.

ప్రబుత్వ పథకాల అమలులో అలసత్వం ఉన్నమాట వాస్తవమేనని బొత్స అంగీకరించారు. ఇంకా కొన్ని హామీలను కాంగ్రెస్ నెరవేర్చాల్సి ఉందన్నారు. జగన్ బెయిల్ అంశంపై కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. వైఎస్‌ఆర్ హయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు న్యాయస్థానంలో రుజువైతే కాంగ్రెస్‌ కూడా తలదించుకోవల్సిందేనని బొత్స వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌


న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజ్వర్ లో ఉంచింది. సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్‌పై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. వాన్‌ పిక్‌కు 18 వేల ఎకరాలు అభివృద్ధికోసం కేటాయించారని, గతంలో చంద్రబాబుకూడా ఇలాంటి భూకేటాయింపులు జరిపారని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. 

పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని, దీనికి క్విడ్‌ ప్రోకో అంటగడుతున్నారని హరీష్‌ సాల్వే వాదించారు. సీబీఐ అభియోగాల్లో పసలేదని, బాబు చేసిన కేటాయింపులపై నోరుమెదపట్లేదన్నారు. మరో వైపు కేసు వివరాలను కోర్టుకు తెలిపిన సిబిఐ, ఈ కేసులో తుది ఛార్జిషీటు దాఖలు చేయటాకిని 4 నుంచి 6 నెలల సమయం కావాలని తెలిపింది. విచారణ పూర్తి అయ్యాకే తుది ఛార్జ్ షీట్ వేస్తామని స్పష్టం చేసింది. కాగా ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం చేశారు?


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు శుష్క, మస్కా వాగ్దానాలిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆ హామీలేవీ నెరవేర్చేవి కావన్నారు. గట్టు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1984 నుంచీ బాబు టీడీపీలో కీలక వ్యక్తి అని, 1995లో మామ నుంచి అధికారాన్ని లాక్కుని ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అప్పటినుంచి తొమ్మిదేళ్లు అధికారం చలాయించిన బాబు అసలు ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారు? వాటిలో ఎన్ని అమలు చేశారనేది తన పాదయాత్ర సందర్బంగా చెప్పి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌నే కాదు, ప్రజలను కూడా తన పాలనలో వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ‘‘1994 ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు రెండు రూపాయల కిలోబియ్యం ఇస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బాబు అధికారం చేజిక్కించుకున్నారు. రెండు రూపాయల కిలోబియ్యం, మద్య నిషేధం వల్ల ఖజానాపై తీవ్ర భారం పడుతోందని చెప్పి 1996 జూన్ 26న (ఎమర్జెన్సీ విధించిన తేదీన) ఒకే రోజు రూ.2,000 కోట్ల మేరకు పన్నులు వడ్డించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బియ్యం ధరను రూ. 3.25కు పెంచడంతో పాటుగా మద్య నిషేధాన్ని ఎత్తి వేసి రూ.1,200 కోట్ల రాబడి పెంచుకున్నారు’’ అని దుయ్యబట్టారు. 

వ్యవసాయరంగం దుస్థితిని గమనించి ఎన్టీఆర్ ఒక హెచ్‌పీకి రూ.50 విద్యుత్ టారిఫ్‌ను వసూలు చేస్తే దానిని రూ.600కు పెంచిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, ఉచిత బస్సుపాసులని 1999 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి, గెలిచాక వాటన్నింటినీ తుంగలో తొక్కారని గుర్తుచేశారు. ముందడుగు వెనక్కి పోయిందని, చేయూత, రోష్ని పథకాలన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఇంటికో వరం అని చెప్పి ప్రతి ఇంటిపైనా పన్ను భారం మోపారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో వృద్ధాప్య పింఛన్లను పట్టించుకోని బాబు ఇప్పుడు దారిలో ఒక ముసలమ్మను చూసి చలించి పోయాననడం హాస్యాస్పదమన్నారు. ఉద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెబుతున్న బాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో 60 శాతం మంది ఉద్యోగులు అవినీతిపరులేనని రాసుకున్న విషయం మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్‌పై మంద కృష్ణ మాదిగ చేసిన విమర్శలను ప్రస్తావించగా... తన హయాంలో 18 లక్షల మంది వృద్ధులకు రూ. 75 పింఛన్ ఇచ్చిన బాబును పక్కన కూర్చోబెట్టుకుని, 71 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చిన వైఎస్ ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని గట్టు వ్యాఖ్యానించారు.